‘బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా రిషికొండకు అవకాశం’

Vijaya Sai Reddy Ask Question In Rajya Sabha Over Rushikonda Beach - Sakshi

ఢిల్లీ: దేశంలో ఎంపిక చేసిన బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ సాధించే దిశగా ప్రభుత్వం ప్రయాత్నాలు ప్రారంభించినట్లు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో వెల్లడించారు. సోమవారం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. దేశంలో బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ కోసం ఎంపిక చేసిన 13 పైలట్‌ బీచ్‌ల జాబితాలో రిషికొండ బీచ్‌ కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.

విశాఖపట్నంలోని రిషికొండ బీచ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీ అయిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌, డెన్మార్క్‌ సంస్థ అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ను జారీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. బీచ్‌లో స్నానానికి వినియోగించే నీటి నాణ్యత, పర్యావరణ యాజమాన్యం.. నీటి రక్షణ కోసం చేపట్టే చర్యల వంటివి ప్రధానమైన అంశాలని ఆయన తెలిపారు. బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌ ఎకో టూరిజం మోడల్‌లో ఉంటుందని మంత్రి వివరించారు. పరిశుభ్రమైన పరిసరాలు, స్వచ్ఛమైన నీరు, పలు సౌకర్యాలు, ఆరోగ్యవంతమైన పర్యావరణం బీచ్‌ సందర్శకులకు కల్పిచటం బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ ప్రధాన లక్ష్యమని మంత్రి బాబుల్‌ సుప్రిమో తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top