అవి‘నీటి’ ఆనవాలు!

Vigilance Enquiry In Neeru Chettu Programme At Srikakulam - Sakshi

నీరు–చెట్టు గుట్టు రట్టు

విజిలెన్స్‌ విచారణలో బయటపడిన అవినీతి

వెలుగులోకి టీడీపీ నేతల అక్రమాలు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జరిగిన నిధుల స్వాహాపై జరుగుతున్న విచారణ

సాక్షి, శ్రీకాకుళం: నీరు చెట్టు సాక్షిగా జరిగిన అక్రమాలు బట్టబయలవుతున్నాయి. ఉపాధిని ధ్వంసం చేసి యంత్రాలను ప్రవేశపెట్టి దోచుకున్న విధానాన్ని అధికారులు తేటతెల్లం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జల సంరక్షణైతే జరగలేదు గానీ వందల కోట్ల రూపాయల నిధులు మాత్రం మింగేశారు. ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందన్న ధోరణిలో తెలుగు తమ్ముళ్లు బరితెగించి స్వాహా చేసేశారు. అధికారులు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో జీ హుజూర్‌ అనేశారు. ఇప్పుడీ అక్రమాలపై శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ చేపడుతున్నారు. 80 శాతం మేర విచారణ ఇప్పటికే పూర్తయింది. అక్రమాలు జరిగినట్టు దాదాపు తేలింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. నిధులు మింగేసిన వారిని బాధ్యులుగా చేస్తూ, వారి  నుంచి తిన్నదంతా కక్కించేందుకు సిఫార్సు చేయనున్నారు.

ఇదో పెద్ద కుంభకోణం
గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు యథేచ్ఛగా నీరు చెట్టు నిధులను దోచేశారు. ఇంజనీరింగ్‌ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలుగా తినేశారు. చెరువుల్లో మట్టి తవ్వకాల పేరుతో క్యూబిక్‌ మీటర్‌కు రూ.29 చొప్పున ప్రభుత్వం నుంచి నిధులు డ్రా చేసుకోగా, మరోవైపు తవ్విన మట్టిన అమ్ముకుని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. నీరు–చెట్టు పథకం కింద చెరువుల్లో తవ్విన మట్టిని సామాజిక అవసరాలకు వినియోగించాలన్న ఆదేశాలను తెలుగు తమ్ముళ్లు బేఖాతరు చేశారు. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్‌ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్‌లు,..ఇలా రకరకాల కాంక్రీటు పనుల రూపంలో కూడా పెద్ద ఎత్తున నిధుల స్వాహాకు పాల్పడ్డారు.

నాసిరకం పనులు చేపట్టి కొన్ని చోట్ల, గతంలో చేసిన పనులకు మెరుగులు దిద్ది మరికొన్ని చోట్ల, నాసిరకం నిర్మాణ సామగ్రితో ఇంకొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. కొన్నిచోట్ల అయితే అసంపూర్తిగా పనులు చేసి పూర్తి స్థాయిలో బిల్లులు చేసుకోగా, పలు గ్రామాల్లో పనులు చేయకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. మన జిల్లాలోనే కాదు పొరుగునున్న విజయనగరంలో కూడా అదే జరిగింది. కొలతల్లో తేడాలైతే చెప్పనక్కర్లేదు. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే రూ. 5లక్షలకు మించిన పనులను టెండర్ల ద్వారా ఖరారు చేయాల్సి ఉండగా నిబంధనలకు తిలోదకాలిచ్చి ఏకపక్షంగా పనులు కొట్టేశారు. చెప్పాలంటే నీరుచెట్టు నిధులను నామినేటేడ్‌ పద్దతిలో మింగేశారు.

చెలరేగిపోయిన జన్మభూమి కమిటీలు
జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు చేసిన అరాచకం ఇంతా ఇంతా కాదు. నీరు చెట్టు కింద చేపట్టే పనులన్నీ వారే దక్కించుకున్నారు. గ్రామాల వారీగా నిధులు పంచేసుకున్నారు. టీడీపీ సర్పంచ్‌లున్నచోట జన్మభూమి కమిటీలు కుమ్మక్కై పనులు చేపట్టగా, టీడీపీ సర్పంచ్‌లు లేని చోట జన్మభూమి కమిటీలు, ఇతర నాయకులు ఏకపక్షంగా పనులు చేసి నిధులు కైంకర్యం చేశారు. టీడీపీ నేతల ధనదాహాన్ని అడ్డుకునేలా ఎక్కడైతే  వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు ఉన్నారో అక్కడ నిధులు మంజూరు చేయకపోవడం విశేషం.

చకచకా విచారణ..
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నీరుచెట్టు పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాదయాత్రలో దారి పొడవునా వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచా రణకు ఆదేశించారు. అందులో భాగంగా శ్రీకాకుళం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రెండు జిల్లాలో సమగ్ర విచారణ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో రికార్డుల ప్రకారం చేసినట్టుగా చూపిస్తున్న రూ. 427.24కోట్ల విలువైన 5696 పనులపైనా, విజయనగరం జిల్లాలో రూ. 177.52కోట్లు విలువైన 4312 పనులపై వి చారణ చేస్తున్నారు. ఇప్పటికే 80శాతం విచారణ జరిగిపోయింది. అందులో దాదాపు అక్రమాలు వెలుగు చూశాయి.

విచారణలో వెలుగు చూసిన అక్రమాలివి
నిబంధనలకు విరుద్ధంగా మట్టి పనిచేశారు. మదుము అడుగు భాగం కంటే బాగా దిగువన మట్టి పనులు చేసి అడ్డగోలుగా నిధులు డ్రా చేసేశారు. 
ఉన్న చెరువు గట్లను బలపడేటట్లు చేయకుండా దానికి బదులు చెరువు గర్భం ఆవల గల ప్రాంతంలో గట్లను వేశారు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్‌ మీటర్‌కు రూ. 29కు గాను రూ. 82.80చెల్లించారు. అంటే క్యూబిక్‌ మీటర్‌కి  రూ. 53.80 చొప్పున అధికంగా చెల్లించారు. 
చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా, ఉన్న దాని కంటే అధికంగా న మోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వి నియోగం చేశారు.
పనులు టెండర్ల వరకు వెళ్లకుండా టీడీపీ నేతలకు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టేందుకు ఒక పనిని ముక్కలు ముక్కలుగా విడదీశారు. 
తవ్విన మట్టిని ప్రధాన గట్టుపై వేయకుండా ఇతర అవసరాలకు వినియోగించి నిధులు మిం గేశారు.
నిబంధనల ప్రకారం రూ. 5లక్షల విలువ లోపు గల పనులను మాత్రమే నామినేటేడ్‌ ద్వా రా చేపట్టాలి.  కానీ శ్రీకాకుళం జిల్లాలో రూ. 50లక్షలు వరకు నామినేషన్‌ ద్వారా పనులను కట్టబెట్టి నిధులు స్వాహా చేసేశారు. 
నిబంధనల ప్రకారం 50ఎకరాలు ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా  50ఎకరాలు కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు నిధులు దుర్వినియోగం చేశారు.   
గడ్డ లేదా వాగు నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఎలాంటి డిజైన్‌ లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. 
నీరు చెట్టు కార్యక్రమంలో రక్షణ గోడలు నిర్మించరాదు. కానీ అందుకు విరుద్ధంగా  ప్రధాన గట్టు కాలువ పొడవునా రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు.
నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టాలి. 
10 హెచ్‌ నిబంధనలకు విరుద్ధంగా మట్టి పని చేపట్టి కాంట్రాక్టర్‌ లబ్ధిపొందారు. 
గార మండలం నారాయణపురం చానల్‌లో నీటిలోనే పూడిక తీత పనులు(ఫైల్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top