రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి ...

Two young people died in road accident - Sakshi

పశ్చిమ గోదావరి /వీరవాసరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు శనివారం మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన దుర్గేష్‌ (25), అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంకు చెందిన వివేకానంద (26) మోటార్‌ బైక్‌పై వీరవాసరం–పెనుమంట్ర రహదారిలో వెళుతుండగా నౌడూరు పద్మాలయ కాన్వెంట్‌ సమీపంలో పెనుమంట్ర నుంచి వీరవాసరం వైపు వస్తున్న లోడు ట్రాక్టర్‌ మోటర్‌ బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాద ఘటనా స్థలంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్‌ చక్రాల కింద పడి మృతదేహాలు నుజ్జయ్యాయి.

 సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వీరవాసరం ఎస్సై ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. దుర్గేష్‌ కుటుంబం చింతలపూడి నుంచి గత కొంతకాలం క్రితం రాయకుదురు వచ్చి స్థిరపడ్డారు. దుర్గేష్‌ ప్రస్తుతం ప్రైవేట్‌ రైస్‌మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతడికి తల్లిదండ్రులతో పాటు, సోదరి ఉంది. వివేకానంద కొమ్మర సొసైటీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దుర్గేష్, వివేకానంద వరుసకు అన్నదమ్ములు. రాయకుదురులో ఉన్న బంధువుల ఇంటి నుంచి పొలమూరిలో ఉన్న బంధువుల ఇంటికి కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top