పేదల ముఖాల్లో చిరునవ్వు కోసం వైఎస్ తపించారు

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్
పెదవాల్తేరు (విశాఖ): పేదల ముఖాల్లో చిరునవ్వు కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్ వర్ధంతి పురస్కరించుకుని బీచ్రోడ్డులోని ఆయన విగ్రహానికి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు వన్నె తెచ్చిన వైఎస్ మృతి చెందిన సెప్టెంబర్ 2 రాష్ట్రానికి చీకటి రోజుగా అభివర్ణించారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడ్ని కోల్పోయామన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు వైఎస్ జ్ఞాపకాలు స్థిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం నాయకులు, కార్యకర్తలు జగన్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబురావు మాట్లాడుతూ వైఎస్ ఈ లోకంలో లేకపోయినా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన హయాంలో రైతులు, పేదలు, అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు. వైఎస్ పాలన జగన్తోనే సాధ్యమన్నారు.
చంద్రబాబు తెలుగు ప్రజల మనోభావాలతో ఆడుకుంటారన్నారు. ఆయన చీకటి పాలనలో ఎస్సీ, ఎస్టీలు కంటి నీరు పెట్టుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బాబు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపాహనోకు, జాన్వెస్లీ, మైనార్టీ విభాగం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్.ఫారూఖీ, జిల్లా అధికార ప్రతినిధి పీతల మూర్తియాదవ్, పక్కి దివాకర్, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాధ, పేర్ల విజయచందర్, గుడ్ల రమణి, వార్డు అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.