
కోస్టల్ కారిడార్కు ప్రణాళిక సిద్ధం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్టు 2015 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు
విశాఖ-చెన్నై మధ్య ఏప్రిల్ నుంచే ప్రారంభం
అడ్డంకిగా మారనున్న భూ సేకరణ
విశాఖ-చెన్నై మధ్య బుల్లెట్ ట్రైన్?
బకింగ్హామ్ కెనాల్ ద్వారా జలరవాణాకు పరిశీలన
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్టు 2015 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) కారిడార్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. కారిడార్లో మెగా టూరిజం ప్రాజెక్టులు, పోర్టుల అభివృద్ధి, పెట్రో కెమికల్ ఇండస్ట్రీలు, ఎల్ఎన్జీ టెర్మిన ళ్లు, పవర్ ఆధారిత పరిశ్రమలపై ఇప్పటికే ఓ బ్లూ ప్రింటును కూడా రూపొందించింది. పోర్టుల నుంచి జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేలా రేడియం రోడ్లు, 6 లేన్ల రహదారులు నిర్మించనున్నారు.
975 కి.మీ. పొడవున్న కోస్తా తీర ప్రాంతం టూరిస్ట్ హబ్గా రూపొందించేందుకు వీలుగా బీచ్ రిసార్ట్స్, క్లబ్ హౌసెస్, హౌస్ బోట్స్ తదితరాలతో అందమైన పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా బకింగ్హామ్ కెనాల్ ద్వారా జలరవాణాకు అనుకూలంగా చేయనున్నారు. ఇందుకు 421.55 కి.మీ. పొడవున్న బకింగ్హామ్ కాలువను కాకినాడ నుంచి చెన్నైలోని విల్లుపురం వరకు జలరవాణాకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఏడీబీ సూచించింది. విశాఖ-చెన్నై నడుమ బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అనువుగా రైలు మార్గంపై అధ్యయనం చేయాలని రైల్వేకు లేఖ కూడా రాసింది.
దక్షిణాసియాకు ప్రధాన వ్యాపార కేంద్రం
కోస్టల్ కారిడార్లో తొలుత పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, సౌకర్యాల కంటే పారిశ్రామిక జోన్ల ఏర్పాటుకు ప్రాధాన్యతిచ్చి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఏడీబీ ప్రణాళికలు రూపొందించింది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, అనంతపురం, ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఐదు పారిశ్రామిక జోన్ల ఏర్పాటుకుగాను రూ.15,320 కోట్లను అందించేందుకు ఏడీబీ సంసిద్ధత వ్యక్తం చేసింది. పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసి జపాన్, చైనా, దక్షిణ కొరియా, యూరప్ల నుంచి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన ప్రతిపాదనలను కూడా ఏడీబీ అందించింది.
1.50 లక్షల ఎకరాల భూమి అవసరం
కోస్టల్ కారిడార్లో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక జోన్లకు మొత్తం 1.50 లక్షల ఎకరాల భూమి అవసరమవుతుందని గతంలోనే నిర్ణయించారు. ప్రధానంగా రాజమండ్రి, భీమవరం, నూజివీడు, విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేటల మీదుగా వెళుతుంది. ఆయా ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు గాను పెద్ద మొత్తంలో భూమి అవసరం కానుంది. భూసేకరణ ఇక్కడ ప్రధాన అడ్డంకిగా మారనుంది. ఈ కారిడార్లో విజయవాడ, గుంటూరు ప్రాంతాలుండటం, ఇక్కడే రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ జరగనుండడంతో మరల పారిశ్రామిక జోన్లకు భూ సేకరణ ఎంతమేరకు సాధ్యమన్నది ప్రశ్నగా మారింది.