జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సహకరించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని కోరారు. జిల్లా పరిషత్ ద్వారా చేపట్టే అన్ని కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా...
విశాఖ రూరల్ : జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సహకరించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని కోరారు. జిల్లా పరిషత్ ద్వారా చేపట్టే అన్ని కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా చూడాలని పంచాయతీరాజ్ అధికారులు, ఇంజినీర్లకు సూచించారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టానని, జెడ్పీ ద్వారా అమలు పరుస్తున్న కార్యక్రామలపై ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పరుచుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు అనే బేధభావం లేకుండా అందరూ సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, ఉద్యోగులకు సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే సామరస్య పూర్వకంగా పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న రోడ్లు, తాగునీటి పథకాలు, పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ, పంచాయతీరాజ్ వ్యవస్థలు అనే తేడా లేకుండా అందరూ పంచాయతీరాజ్ ఉద్యోగులనే భావనతో కలిసిమెలసి ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లా పరిషత్ ద్వారా అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా అమలుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ కె.రవీంధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.