‘నా పేరు మీస వరుణ్ వర్మ. నేను మానకొండూర్లో 7వ తరగతి చదువుతున్న. కరీంనగర్– వరంగల్ జాతీయ రహదారి పూర్తవుతుండగా మా గ్రామ స్టేజీ వద్ద కెనాల్ ఉండటంతో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఎడమ పక్కన సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయకపోవడం వల్ల పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. మాకే కాదు ప్రజలందరికీ తీవ్ర ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ మేడమ్.. మీకు దండం పెడుతున్నా సర్వీస్ రోడ్డుతో పాటు బస్టాప్ ఏర్పాటు చేస్తేనే మా చదువులు సాగుతాయి.. లేకుంటే అంతే’

కరీంనగర్ అర్బన్/మానకొండూర్: సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల పూర్తిగా గ్రామానికే రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డు లతో సోమవారం కలెక్టరేట్కు భారీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. తమ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి వెలిబుచ్చిన కష్టం అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం కలెక్టర్ చిత్రామిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు.


