జోరు మీదున్న డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా | Digital Public Infrastructure Could Quadruple GDP By 2030 Niti Aayog | Sakshi
Sakshi News home page

జోరు మీదున్న డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 8:00 AM

Digital Public Infrastructure Could Quadruple GDP By 2030 Niti Aayog

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం జీడీపీలో 1 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి ఇది 4 శాతానికి చేరుకుంటుందని నీతి ఆయోగ్‌ నివేదిక అంచనా వేసింది. చరిత్రాత్మక మార్పు మలుపు దశలో భారత్‌ ఉన్నట్టు పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ డిజిటల్‌ వ్యవస్థలు సామాజిక, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని తెలిపింది.

ఈ లక్ష్యాలను చేరుకోవడానికి నీతి ఆయోగ్‌ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. రాష్ట్రాల నాయకత్వంలో సాగే వినూత్న కార్యక్రమాల ద్వారానే డీపీఐ 2.0 విజయవంతమవుతుందంటూ.. దీనికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ మార్గదర్శకులుగా వ్యవహరిస్తాయని పేర్కొంది. రంగాల వారీ మార్పులు తీసుకురావడానికి రెండేళ్ల కార్యాచరణను అనుసరించాలని సూచించింది. తొలి ఏడాది ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టి, వాటి ఫలితాలను విశ్లేషించాలని పేర్కొంది. మొదటి ఏడాది సాధించిన విజయాలను రెండో ఏడాది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది.  

ఉపాధి కల్పన కీలకం.. 
2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించే అభివృద్ధి మార్గాలు అవసరమని నీతి ఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు సుమన్‌ బేరీ ఈ నివేదికను విడుదల చేసిన సందర్భంగా పేర్కొన్నారు. ‘‘గత దశాబ్ద కాలంలో సేవలను ప్రజలకు చేరవేయడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో డిజిటల్‌ వ్యవస్థలు  అద్భుతమైన పనితీరు చూపించాయి. రాబోయే దశలో డిజిటల్‌ అనుసంధానానికే పరిమితం కాకుండా, ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, సామర్థ్యాలను పెంచడంతోపాటు.. రంగాలు, ప్రాంతాల వారీ కొత్త చోదక కేంద్రాలను సృష్టించడంపై దృష్టి సారించాలి’’అని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement