నూతన ఫీజు
- ప్రైవేటు పాఠశాలల్లో అదనపు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే
- సలహాలు, సూచనల కోసం డీపీఐ వెబ్సైట్లో వివరాలు
సాక్షి, బెంగళూరు : ప్రాంతాన్ని బట్టి విద్యార్థుల నుంచి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వసూలు చేయాల్సిన ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను విద్యానిపుణులు, పాఠశాలల యాజమాన్యాలతో పాటు ప్రజల సౌకర్యార్థం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డీపీఐ) అధికారిక వెబ్సైట్లో ఉంచింది. దీనిపై సలహాలు, సూచనలను ఇవ్వడానికి 30 రోజుల సమయాన్ని ప్రకటించింది. ఒకే ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వేర్వేరు ఫీజులు ఉన్న విషయమై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై పూర్తి నివేదికను అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ ఏడాది మార్చిన ఆదేశించింది. దీంతో విద్యాశాఖ కమిషనర్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీని అదే నెల 13న ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించి, అక్కడి మానవవనరులు, అందిస్తున్న జీతభత్యాలతో పాటు విద్యాసంస్థల్లోని మౌలిక వసతులను పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయించారు. అంతేకాకుండాఆయా తరగతుల్లో చేరడానికి విద్యార్థులకు ఉండాల్సిన కనీస వయసు, తరగతిలోని విద్యార్థుల సంఖ్య, బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య ఈ వివరాలనే డీపీఐ అధికారిక వెబ్సైట్ www.schooleduction.kar.nic.in లో ఉంచారు. నూతన ఫీజు విధానం మేరకు ఒక్కొక్క విద్యార్థికి చెల్లించాల్సిన ఏడాది ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి...
ప్రీ ప్రైమరీ పాఠశాలలు బీబీఎంపీ - రూ.11,500 మైసూరు, హుబ్లీ, డార్వాడ -రూ. 6,900 మిగిలిన జిల్లా కేంద్రాలు - రూ.5,600 తాలూకా కేంద్రాలు - రూ.3,750 గ్రామాల్లో - రూ.1,872 లోయర్, హయ్యర్ ప్రైమరీ పాఠశాలలు బీబీఎంపీ, మైసూరు, హుబ్లీ, డార్వాడ -రూ. 6,400 మిగిలిన జిల్లా కేంద్రాలు - రూ.4,600 తాలూకా కేంద్రాలు - రూ.2,800 గ్రామాల్లో - రూ.1,800 హై స్కూల్ బీబీఎంపీ, మైసూరు, హుబ్లీ, డార్వాడ -రూ.13,130 మిగిలిన జిల్లా కేంద్రాలు - రూ.6,000 తాలూకా కేంద్రాలు - రూ.5,200 గ్రామాల్లో - రూ.4,160