తెనాలిరూరల్ :ఉన్నత విద్యను అభ్యసించినా, చెడు వ్యసనాల కారణంగా చోరులుగా మారిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 6.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనపర్చుకున్నారు.
తెనాలిరూరల్ :ఉన్నత విద్యను అభ్యసించినా, చెడు వ్యసనాల కారణంగా చోరులుగా మారిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 6.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనపర్చుకున్నారు. ఆ వివరాలను సోమవారం తెనాలి టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైం) ఎ. శోభామంజరి వెల్లడించారు. గుంటూరుకు చెందిన రాగిపాటి బాలు, జంగం జరియల్, భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన గుంటూరు సురేష్ స్నేహితులు. పాత నేరస్తుడయిన బాలు అలియాస్ బాలయ్య ఆటో నడుపుతుండగా, జరియల్ ఇంజినీరింగ్ చదివాడు.
సురేష్ లా విద్యార్థి. జరియల్ మరదలు చెన్నైలో చదువుకుంటోంది. ఆమెకు విలువైన బహుమతులు ఇవ్వాలని, అందుకు పెద్దమొత్తంలో నగదు అవసరమని స్నేహితులకు చెప్పాడు. దీనికితోడు ముగ్గురూ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన చేశారు. టీవీ సీరియళ్లలో చూపినట్టు చైన్స్నాచింగ్ సులువైన మార్గమని బాలు చెప్పాడు.
దీంతో నరసరావుపేట నవోదయ నగర్, అరండల్పేట, రేపల్లెలో, మంగళగిరిలోని గాంధీబజారు, మార్కెట్ వద్ద, తెనాలి నందులపేట, కొత్తపేటలలో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కుని వెళ్లారు. గుంటూరు నల్లపాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో 15 ఎల్సీడీ మానిటర్లు, రెండు సీపీయూలు, ఒక ప్రొజెక్టర్ను అపహరించుకెళ్లారు. వీటి మొత్తం విలువ రూ. 6.50 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. నిందితులను సీఐలు కళ్యాణ్రాజు, బి. శ్రీనివాసరావు అరెస్ట్ చేశారని వివరించారు. సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.