ఈ ఏడాది నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
హాలియా, న్యూస్లైన్: ఈ ఏడాది నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలకు ఖరీఫ్ నిండా ముంచితే రబీలోనైనా గట్టెక్కుదామని రైతులు ఆయకట్టులో వరిసాగు చేశారు. తీరా చూస్తే ఎన్ఎస్పీ అధికారులు ఆరుతడి పంటలకే నీరిస్తామని తేల్చారు. వారబంది ప్రకారం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆయకట్టు తడారిపోతోంది.
ఎండుతున్న పొలాలు
వారబందితో సాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఉన్న ఆయకట్టు ఎండిపోతోంది. ఈ ఏడాది సాగర్ జలాశయంలో పుష్కలంగా నీరున్నా ప్రభుత్వం ఆరుతడి పంటలకే నీటిని విడుదల చేస్తామని ప్రకటించింది. అయినా ఆయకట్టు రైతులు రబీలో వరిసాగు చేశారు. ప్రభుత్వం వారబంది ప్రకారం నీటిని విడుదల చేయడంతో కాల్వ చివరి భూములకు నీరందడం లేదు. ఎడమ కాల్వ కింద జిల్లాలో 4.31లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. దీనిలో ఇప్పటి వరకు 3.75ఎకరాల్లో వరినాట్లు వేశారు. వారబంది ప్రకారం ఈ కాల్వకు ఈ నెల 5నుంచి 8వరకు నీటి విడుదల నిలిపివేశారు. దీంతో అప్పుడే నాటు వేసిన పొలాలకు పుల్క దిగకపోవడంతో పాటు ముందుగా నాటు వేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే పొలాలకు సరిగా నీరందక ఎండుతుంటే ఇక మార్చి, ఏప్రిల్ నెలల్లో పెరిగే ఎండలకు పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నీటికోసం ఆందోళనలు
వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలాలు వారబంది విధానం వల్ల ఎండుతుండడంతో అన్నదాతలు ఆవేదనకు గురై ఆందోళనకు దిగుతున్నారు. ఎడమ కాల్వ పరిధిలో మొదటి మేజర్ రాజవరం మేజర్ కాల్వ, ఇది 10,820 కిలోమీటర్ల పొడవుంది. దీనికింద 9356.56 ఎకరాలను మొదటగా స్థిరీకరించి 156.25క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సూరేపల్లి మేజర్ కాల్వ కింద కూడా 5133.17 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 80.27 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే, ప్రస్తుతం ఈ మేజర్ల కింద ఆయకట్టు స్థిరీకరణలో మార్పు రావడంతో ఈ నీరు చివరి పొలాలకు సరిపోక పంట ఎండిపోతోంది. దీంతో ఇటీవల హాలియా మండంలోని రాజవరం, బోయగూడెం, కొంపల్లి, వీర్లగడ్డ తండా, పుల్లారెడ్డిగూడెం గ్రామాల రైతులు వారబంది విధానం ఎత్తివేసి ఏప్రిల్ వరకు నీరివ్వాలని డిమాండ్ చేశారు.