వీసీబీ సభ్యులకు మెరుగైన సేవలు
● డైరెక్టర్ జేవీ సత్యనారాయణమూర్తి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘సహకార, అర్బన్ బ్యాంకింగ్ రంగంలో దక్షిణ భారతదేశంలోనే ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంకు (వీసీబీ) అగ్రగామిగా ఉంది. దీని ద్వారా సభ్యులకు మెరుగైన సేవలను అందించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని వీసీబీ డైరెక్టర్ జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. నగరంలోని స్టోన్హౌస్పేటలో ఉన్న ఓ కల్యాణ మండపంలో సోమవారం నెల్లూరు బ్రాంచ్ సభ్యుల మహాసభ సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 109 సంవత్సరాలుగా విశాఖపట్నం కేంద్రంగా బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తూ సామాన్యుల బ్యాంకుగా పేరొందిందన్నారు. రూ.7,348 కోట్ల మైలురాయిని దాటి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.87 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు చెప్పారు. నేడు రూ.353.61 కోట్ల షేర్ ధనంతో రికార్డు స్థాయికి వీసీబీ చేరుకోవడం అభినందనీయమన్నారు. నూతన సభ్యులు చేరేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే వారికి 4 శాతం నగదును ప్రోత్సాహకంగా తిరిగి ఇవ్వడం జరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు బ్రాంచ్లు ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతి వచ్చినట్లు చెప్పారు. వ్యక్తిగత ప్రమాద బీమా పథకం, మృతిచెందిన సభ్యుని కుటుంబానికి ఆర్థిక సాయం, ఇతర జాతీయ బ్యాంకుల కంటే డిపాజిట్లపై అధిక వడ్డీ, ప్రధానమంత్రి బీమా జీవన జ్యోతి, ఏటీఎం సౌకర్యం, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం బ్రాంచ్ సీనియర్ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ టీఆర్కేవీ శర్మ, జోనల్ మేనేజర్ వెంకటేష్, బ్యాంకు వైస్ చైర్మన్ రాఘవరావు, లీగల్ అడ్వైజర్లు పెంచలయ్య, కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.