కోల్‌కతా కేంద్రంగానే కుంభకోణం | The scandal is centered in Kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతా కేంద్రంగానే కుంభకోణం

May 14 2017 2:49 AM | Updated on Sep 5 2017 11:05 AM

కోల్‌కతా కేంద్రంగానే కుంభకోణం

కోల్‌కతా కేంద్రంగానే కుంభకోణం

కోల్‌కతా కేంద్రంగా సాగిన భారీ హవాలా కుంభకోణం బ్యాంకు లావాదేవీలు విశాఖ నుంచే ఎక్కువగా జరిగాయని విశాఖ శాంతి భద్రతల డీసీపీ నవీన్‌ గులాటి తెలిపారు.

బ్యాంకు లావాదేవీలు విశాఖ నుంచి
- బ్యాంకు అధికారుల పాత్రపై విచారణ
- దర్యాప్తునకు మూడు ప్రత్యేక బృందాలు
- కేసును సీబీఐకి అప్పగించే అవకాశం
- విశాఖ డీసీపీ నవీన్‌ గులాటి వెల్లడి


సాక్షి, విశాఖపట్నం: కోల్‌కతా కేంద్రంగా సాగిన భారీ హవాలా కుంభకోణం బ్యాంకు లావాదేవీలు విశాఖ నుంచే ఎక్కువగా జరిగాయని విశాఖ శాంతి భద్రతల డీసీపీ నవీన్‌ గులాటి తెలిపారు. పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విశాఖ కేంద్రంగా హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు విదేశాలకు తరలిపోయిన కేసులో 12 డొల్ల కంపెనీలున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకు అధికారుల పాత్రపై 3 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.  రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని, పలువురు నిందితులను దర్యాప్తు బృందాలు గుర్తించినట్లు సమాచారం ఉందన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐకి బదిలీ చేసే అవకాశముందన్నారు.

అన్నీ డొల్ల కంపెనీలే
హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న 12 డొల్ల కంపెనీల పేర్లను డీసీపీ వెల్లడిం చారు. వీటిలో శ్రీ పద్మప్రియ స్టోన్‌ క్రషింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, (ఎంవీపీ కాలనీ), బాలముకుంద్‌ వేర్‌హౌస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పాండు రంగాపురం), లావెండ్‌ ఈసిస్టమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వామ్‌వుడ్స్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సిరికోస్‌ ఎక్స్‌పోర్ట్సు ప్రైవేట్‌ లిమిటెడ్, శివకృపా ట్రేడ్‌లింక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫాక్స్‌గ్లోవ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, క్లౌడ్‌»ñ ర్రీ సాప్ట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రైమ్‌ రోజ్‌ టెక్నో సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మార్క్‌ ఈ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కౌస్తవ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, డెల్పినియమ్‌ ఈ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నాయని వివరించారు. కోల్‌కతా, హైదరాబాద్‌లతో పాటు, విశాఖలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్, విజయ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో పాటు మరికొన్ని బ్యాంకుల్లో 30 అకౌంట్లు ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత అకౌంట్లపై ఆదాయపు పన్ను శాఖ చేసిన ప్రాథమిక విచారణలో వాటి యజమానులు, ఉద్యోగుల పేరిట ఈ ఖాతాలు ఓపెన్‌ చేసినట్లు గుర్తించారు. ఈ అకౌంట్లలోకి రూ.680.94 కోట్లు విదేశాల నుండి జమ అయినట్లు కనుగొన్నారు. వాటి నుండి రూ.569.93 కోట్లు చైనా, సింగపూర్, హాంకాంగ్‌కు సంబంధించిన నకిలీ ధ్రువపత్రాలతో సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అటువంటి సాఫ్ట్‌వేర్‌ దిగుమతులు ఏమీ జరగలేదని ఆయన తెలిపారు. నిందితులు భారత ప్రభుత్వాన్ని మోసం చేసి ఆ సొమ్మును విదేశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక బృందాలు
కేసు దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక బృందాలు శ్రీకాకుళం, కోల్‌కతా, హైదరాబాద్‌ ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నాయని, ఇప్పటి వరకు వారి నుండి ఎటువంటి సమాచారం లేదని డీసీపీ తెలిపారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల అధికారులతో కలిసి దర్యాప్తు చేపట్టాల్సి ఉన్నందున కొంత సమయం పడుతుందన్నారు. నిందితులంతా హైదరాబాద్, కోల్‌కతా ప్రాంతాల వారు కావటంతో బ్యాంకు అకౌంట్లు, డాక్యుమెంట్లు పరిశీలించాల్సి ఉందన్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఫిర్యాదు ప్రకారం 9 మందిని నిందితులుగా చేర్చామన్నారు. బ్యాంకు అకౌంట్లు కూడా హైదరాబాద్, కోల్‌కతా, విశాఖపట్నంలలో ఓపెన్‌ చేశారని, ఎక్కువగా విశాఖపట్నంలో 22 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయన్నారు.

వీటి ద్వారా హాంకాంగ్, సింగపూర్, చైనా లకు మనీ ట్రాన్స్‌ఫర్‌ జరిగిందన్నారు. విదేశాలకు నగదు బదిలీ చేయాలంటే ఇన్‌వాయిస్‌ చేయాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ అలాంటివేమీ జరగలేదన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా ఈ లావాదేవీలు జరిగాయన్నారు. దీనిపై చీటింగ్, ఫోర్జరీ, మనీలాండరింగ్‌ చట్టాలు, సెక్షన్లపై చార్జిషీటు ఫైల్‌ చేసే సమయానికి దర్యాప్తును అనుసరించి మరిన్ని కేసులు నమోదు చేయనున్నామని, ఇప్పటికే వివిధ సెక్షన్ల ద్వారా కేసులు నమోదు చేశామని తెలిపారు. కాగా, ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ తమ అదుపులో లేడని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ టి.యోగా నంద్‌ స్పష్టం చేశారు. ఈ కేసులో ఏ చిన్న పురోగతి ఉన్నా వెల్లడిస్తామని చెప్పారు.

గుర్తించిన నిందితులు
 ఈ కేసులో ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ స్వస్థలం పశ్చిమగోదా వరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురం కాగా అతను ఫైనాన్స్‌ వ్యాపా రం పేరుతో ఏడాదిగా శ్రీకాకుళంలో అద్దెకు నివాసం ఉంటున్నాడు. రెండో నిందితుడు ఇతని తండ్రి శ్రీనివాసరావు. ఇతర నిందితులు ఆచంట హరీష్, ఇంతా రాజేష్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ప్రశాంతకుమార్‌ రాయ్‌ బర్మన్, ప్రవీణ్‌కుమార్‌ జాలు చార్టెడ్‌ అకౌంటెంట్లు. వారితో పాటు ఆయిష్‌ గోయల్, వినీత్‌ గోయంకా, వికార్‌గుప్తాలు కోల్‌కతాకు చెందినవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement