రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రజల్ని, రైతులను మోసం చేసేదిగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు.
- ఇది ప్రజల్ని మోసం చేయడమే
- రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రజల్ని, రైతులను మోసం చేసేదిగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో గత ఏడాది కేటాయింపులే ఈ ఏడాది కూడా యథాతథంగా ఉన్నాయని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ విధంగా కట్ అండ్ పేస్ట్లా బడ్జెట్ తయారు చేయడం ఇదే మొదటిసారన్నారు.
పంటల భీమా పథకాన్ని కేంద్రం మార్పులు చేసిందని, ఇన్య్సూరెన్స్ ప్రీమియాన్ని కూడా 11 శాతానికి పెంచిందన్నారు, దీంతో రాష్ట్ర వాతా కూడా పెంచాల్సి ఉందని, అయితే గత ఏడాది ఎంత కేటాయించారో ఇప్పుడు కూడా అంతే కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. వరిసాగు పెరిగిందని చెప్పడం కూడా ప్రజల్ని మోసం చేయడ మేనన్నారు. గత ఏడాది నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో పంట వేయలేదని, కృష్ణాడెల్టాలో రబీకి క్రాప్హాలిడే ఇచ్చారని గుర్తు చేశారు.
ఈ ఏడాది అన్ని చోట్ల పంట వేయడంతో విస్తీర్ణం పెరిగినట్లుగా చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. సబ్సిడీ మీద అందించే రసాయన ఎరువుల వాడకాన్ని పెంచగలిగామని చెప్పడం సరికాదన్నారు. ధరల స్థిరీకరణ కోసం మూడు వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయన్నుట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించడంతో తాము వెనకపడిపోతామన్న భయంతో గత బడ్జెట్లో ఆలంబన నిధిని ఏర్పాటు చేసి వంద కోట్ల రూపాయలు కేటాయించినట్లు గత ఏడాది ప్రవేశపెట్టిన ప్రత్యేక బడ్జెట్లో పేర్కొన్నారన్నారు.
ఈ ఏడాది బడ్జెట్లో దాని ఊసే లేదన్నారు. శనగ, మినప, పెసర పంటలకు ధరలు తగ్గి రైతులు నష్టపోయినా ఒక్క పైసా నిధిని కూడా వారి కోసం ప్రకటించలేదని విమర్శించారు. 2008-09లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి 80,379 కోట్ల రూపాయలతో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో 40.17 శాతం ప్రణాళికా బడ్జెట్ కేటాయించగా, ఈ ఏడాది బడ్జెట్ లక్షా 80 వేల కోట్లకు చేరినా ప్రణాళికా కేటాయింపులు 37.01 శాతానికి పరిమితం అయ్యాయని విమర్శించారు.