2015-2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక ప్రతిపాదిత బడ్జెట్ రూ.2500 కోట్లతో సిద్ధమవుతోంది.
తిరుమల: 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక ప్రతిపాదిత బడ్జెట్ రూ.2500 కోట్లతో సిద్ధమవుతోంది. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి రూ.2,401 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఖరారు చేశారు. తాజా బడ్జెట్ మరో వంద కోట్ల దాకా పెరిగే అవకాశాలున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు.
రానున్న ఆర్థిక సంవత్సరంలో రాబడి అంచనాలు, ఖర్చుల ప్రతిపాదనలను విభాగాల వారీగా లెక్కలు వేయడంలో ఆర్థిక నిపుణుల బృందం నిమగ్నమై ఉంది. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి కల్పన, ధార్మిక సంస్థ ఉద్యోగుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం టీటీడీకి సాధికారిక మండలి (స్పెసిఫైడ్ అథారిటీ) ఉంది. బడ్జెట్ సమావేశం ఈనెలాఖరు లేదా ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించే అవకాశం ఉంది. కాగా 2010-2011లో టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.1,338 కోట్లు, 2011-2012లో రూ.1,661 కోట్లు, 2012-2013లో రూ.2,010 కోట్లు, 2013-2014లో రూ.2,248 కోట్లతో బడ్జెట్ ఖరారు చేశారు.