అనునిత్యం కష్టించి పనిచేసే వారి జాబితాలో ఆర్టీసీ కార్మికులు ముందు వరుసలో ఉంటారని, అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వడానికి వెనుకాడటం తగదని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.
సమ్మెకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు
ప్రోద్దుటూరు, కడప డిపోల వద్ద ఉద్రిక్తత
కార్మిక సంఘాల నేతల అరెస్ట్
కిక్కిరిసిన రైళ్లు, కొనసాగిన ప్రైవేట్ వాహనాల దోపిడీ
రెండు రోజుల్లో జిల్లాలో రూ.1.90 కోట్లు నష్టం
సాక్షి, కడప : అనునిత్యం కష్టించి పనిచేసే వారి జాబితాలో ఆర్టీసీ కార్మికులు ముందు వరుసలో ఉంటారని, అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వడానికి వెనుకాడటం తగదని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. రాజంపేటలో గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, బద్వేలులో ఎమ్మెల్యే తిరువీధి జయరాములు, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తదితరులు ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులను ప్రస్తుత ప్రభుత్వం కాల రాస్తోందని దుమ్మెత్తి పోశారు. చార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారం వేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచడానికి ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ప్రజలు రెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేక పోవడం దురదృష్టకరమన్నారు. ఆందోళన చేస్తున్నారనే కారణంతో అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులు నడిపిస్తున్నారని..ఏదైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరు, కడప డిపో వద్ద ఉద్రిక్తత
ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసి కార్మికులు ఆందోళన చేస్తుండగా.. యాజమాన్యం డిపో లోంచి బస్సులను బయటకు తీసుకు రావడంతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు కొంత మంది ఆర్టీసి యూనియన్ నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కడపలో కూడా డిపో ఆవరణంలో కార్మికులు బస్సులను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆగిన బస్సులు.. ప్రయాణికుల ఇక్కట్లు
ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగడంతో ఎక్కడికక్కడ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎనిమిది డిపోలకు చెందిన సుమారు 600కు పైగా బస్సులు నిలిచిపోయాయి. 340 బస్సులను (100 ఆర్టీసీ, 240 అద్దె బస్సులు) ఆర్టీసీ అధికారులు నడిపించారు. రెండు రోజులుగా జిల్లాలో రూ.1.90 కోట్ల మేర నష్టం వచ్చినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అత్యధిక శాతం బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రైళ్లు కిటకిటలాడాయి. ప్రైవేట్ వాహనాల దోపిడీ కొనసాగింది.