రింగ్ రింగా.. | tenders to railway development works with Rs 23 crores | Sakshi
Sakshi News home page

రింగ్ రింగా..

Jan 21 2014 4:28 AM | Updated on Sep 2 2017 2:49 AM

గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో దాదాపు రూ.23 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్లు ఎప్పటిలాగే సిండికేట్ అయ్యారు.

గుంతకల్లు, న్యూస్‌లైన్ : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో దాదాపు రూ.23 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్లు ఎప్పటిలాగే సిండికేట్ అయ్యారు. కొన్ని పనులకు సంబంధించి మాత్రమే పోటాపోటీగా షెడ్యూళ్లు దాఖలు చేశారు. గుంతకల్లు రైల్వే డీజిల్‌షెడ్డులో రెండు పనులను రూ.13,25,904తో, ఇంజనీరింగ్ బ్రాంచి పరిధిలో తొమ్మిది పనులను రూ.22 కోట్ల 37లక్షల 52 వేల 499తో, ఎలక్ట్రికల్ విభాగంలో ఒక పనిని రూ.56,33,382తో చేపట్టడానికి టెండర్లు పిలిచారు.

సోమవారం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలోని టెండరు కమిషనరేట్‌లో ప్రక్రియ చేపట్టారు. భారీ మొత్తంతో కూడిన పనులను దక్కించుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఒక రోజు ముందుగానే గుంతకల్లుకు చేరుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. పోటీ లేకుండా షెడ్యూళ్లు దాఖలు చేయడానికి మార్గం సుగమం చేసుకున్నారు. చిన్నాచితక పనుల విషయంలో మాత్రం పోటీ పడి షెడ్యూళ్లు దాఖలు చేశారు.

ప్రధానంగా నంద్యాల - గుంతకల్లు సెక్షన్‌లోని రంగాపురం కంకర డిపోనకు 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల బెలాస్ట్ సరఫరా కోసం రూ.9,06,48,450తో పిలిచిన టెండర్‌ను దక్కించుకోవడానికి ఆ ప్రాంత నాయకులు రంగంలోకి దిగారు. ఈ పనికి డమ్మీ షెడ్యూల్‌తో కలిపి కేవలం రెండు మాత్రమే దాఖలైనట్లు సమాచారం. గుంతకల్లులోని శాంతినగర్, సౌత్ కాలనీలలో 96 సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి, రన్నింగ్ రూమ్ రిపేర్ల కోసం, రైల్వే ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చే అటెండర్ల కోసం డార్మెటరీ నిర్మాణానికి  రూ.2,13,31,392 కేటాయించారు.

గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలోని కమర్షియల్, జనరల్, ఆపరేటింగ్, సెక్యూరిటీ, ఎలక్ట్రికల్, పర్సనల్ బ్రాంచి కార్యాలయాల రిపేర్ల కోసం, మెకానికల్, ఎస్‌అండ్‌టీ కార్యాలయాల అభివృద్ధి కోసం, ఆర్‌పీఎఫ్ డాగ్ టన్నెల్ భవన నిర్మాణానికి రూ.1,17,57,920 కేటాయించారు. రేణిగుంటలో డ్రైనేజీ, సీవెర్‌లైన్‌ల నిర్మాణం, తిరుపతి-గూడూరు సెక్షన్‌లోని మామండూరు రైల్వేస్టేషన్‌లోనూ, వెంకటగిరి-వెండూడు, శ్రీకాళహస్తి-ఏర్పేడు రైల్వేస్టేషన్ల మధ్య డ్రైయినేజీల నిర్మాణానికి రూ.1,59,51,771 కేటాయించారు. ఇవి ముఖ్యమైన పనులు కావడంతో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి షెడ్యూళ్లు దాఖలు చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement