‘జుత్తు’లమారి దందా | Call recording threatening contractor goes viral on social media | Sakshi
Sakshi News home page

‘జుత్తు’లమారి దందా

Jul 8 2026 3:07 AM | Updated on Jul 8 2026 3:07 AM

Call recording threatening contractor goes viral on social media

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో బెదిరింపులకు పాల్పడిన గుంటూరు శీను (ఫైల్‌)

అహోబిలంలో అఖిల అనుచరుల గూండాగిరీ   

తలనీలాల కాంట్రాక్ట్‌ వెనక్కి తీసుకోవాలని వార్నింగ్‌   

కాంట్రాక్టర్‌ను బెదిరించిన కాల్‌ రికార్డింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌

ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియకు అధికారమే పెట్టుబడి అయింది. తాము నిర్ణయించిన ధరకే.. సూచించిన వ్యక్తుల పేరుమీదనే టెండర్లు కట్టబెట్టాలని హుకుం జారీ చేస్తూ ఇష్టారాజ్యంగా స్వామి సొమ్ములు దోచుకుతింటూ.. భక్తులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. తాజాగా చెన్నైకి చెందిన తలనీలాల కాంట్రాక్టర్‌కు అఖిల అనుచరులు ఫోన్‌ చేసి ప్రాణాలమీద ఆశ ఉంటే తలనీలాల సేకరణకు ఆళ్లగడ్డకు రావద్దని బెదిరించిన కాల్‌ రికార్డ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. 

తలొగ్గని కొత్త సీఏఓ.. రెచ్చిపోయిన భూమా 
అహోబిలంలో ఏటా నవనారసింహ స్వాముల దేవాలయాల పరిధిలో తలనీలాలు సేకరించుకునే హక్కుకు వేలంపాటలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే అఖిలప్రియ ఆనవాయితీకి తిలోదకాలు ఇచ్చేశారు. తలనీలాలతో పాటు ఏ వేలం పాట కూడా నిర్వహించకుండా నామినేటెడ్‌ పద్ధతిలో తమకు రాసివ్వాలని హుకుం జారీ చేశారు. అధికార పార్టీ నేతతో ఎందుకొచ్చిన తలనొప్పి అని గత ఏడాది మొత్తం ఆమె చెప్పిన ధరకు, చెప్పిన వ్యక్తుల పేరుమీద రాసిచ్చేశారు. దీంతో దేవస్థానం రూ.కోట్లలో నష్టపోయింది. 

పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకునే స్థోమత లేకుండా పోయింది. ఇలాగే ఇస్తూ పోతే దేవుడికి పూజా కైంకర్యాలు కూడా చేయలేమని భావించిన మఠం నిర్వాహకులు కచ్చితమైన అధికారిని సీఏఓగా నియమించింది. అంతే ఈయన వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతలకు ఏమాత్రం తలొగ్గలేదు సరికదా కనీసం ఇంటి దగ్గరకు వెళ్లి కలువను కూడా కలవలేదు. మేడం రమ్మంటుందని ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోలేదు. చివరకు రెండుమూడుసార్లు అఖిలప్రియ అహోబిలానికి వచ్చినప్పుడు ఆఫీస్‌కు రండి మీతో మాట్లాడాలని చెప్పినా ఆయన ససేమిరా అన్నారు. 

చివరకు డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కూడా తీవ్ర ఒత్తిడి చేయించారు. ఎమ్మెల్యే రమ్మంటుంటే ఎందుకు వెళ్లవు, ఏదైనా లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లం వస్తే నీపై కేసు కట్టాల్సి వస్తుందని బెదిరించారు. చివరకు జిల్లా ఎస్పీ కూడా ఎమ్మెల్యే అఖిలప్రియను, సీఏఓ పార్థసారథిని తన కార్యాలయానికి పిలిపించుకుని రాజీ చేసే యత్నం చేసినా కుదరలేదు. వేలం పాట పెడుతాం, ఎవరు ఎక్కువగా పాడితే వారికే ఇస్తాం.. ఇందులో రాజకీయాలతో తమకు సంబంధం లేదని సీఏఓ చెప్పారు. తలనీలాల వేలంపాట పెట్టేందుకు ప్రకటన జారీచేశారు.  

దీంతో వేలంపాట ఎలా నిర్వహిస్తారో చూస్తామని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులను అందరినీ అక్కడకు తరలించి అఖిల భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో వేలంపాట రద్దు చేసిన దేవస్థానం రూ.1.80 కోట్లకు చెన్నైకి చెందిన కంపెనీకి తలనీలాలు సేకరించుకునే హక్కులను రాసిచ్చారు. అయినా కాంట్రాక్టర్‌ ఇక్కడకు వచ్చి తలనీలాలు తీసుకువెళ్లేందుకు భయపడుతుండటంతో కొన్ని రోజులుగా దేవస్థానం నిర్వాహకులే సేకరించిన తలనీలాలను చెన్నైకి తరలిస్తున్నారు.

 విషయం తెలుసుకున్న అఖిలప్రియ అనుచరుడు గుంటూరు శీను గతంలో టీడీపీ కాంట్రాక్టర్‌ వద్ద వెంట్రుకలు కొనుగోలు చేసిన ఓ మహిళా కాంట్రాక్టరు గొడిగెనూరు నరసమ్మను కలిసి చెన్నైకి చెందిన కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేశారు.‘‘మా అనుమతి లేకుండా ఎలా టెండర్‌ వేస్తావు.. ప్రాణాలమీద ఆశ వదులుకుంటేనే ఇక్కడకు వచ్చి వ్యాపారం చేసుకో.. కాంట్రాక్ట్‌ రద్దు చేసుకోకుంటే నీ అంతు చూస్తాం’’ అని బెదిరించారు. తాజాగా ఈ వాయిస్‌ కాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement