ఖాళీ దిశగా ‘దేశం’ | Telugudesam party empty in Adilabad District | Sakshi
Sakshi News home page

ఖాళీ దిశగా ‘దేశం’

Feb 21 2014 2:49 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఖాళీ దిశగా ‘దేశం’ - Sakshi

ఖాళీ దిశగా ‘దేశం’

ఆదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కేడర్ చాలావరకు పార్టీకి దూరం అయింది.

 టీడీపీకి జిల్లా అధ్యక్షుడు గొడాం నగేష్ గుడ్‌బై
 
 సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కేడర్ చాలావరకు పార్టీకి దూరం అయింది. తాజాగా, తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేక వైఖరి, పార్టీలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్ టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్వగ్రామమైన బజార్‌హత్నూర్ మండ లం జాతర్లలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతానని కూడా వెల్లడించారు. చంద్రబాబు టీ-బిల్లును అడ్డుకునేందుకు చేసిన ఒత్తిళ్లు, కార్యకర్తల అభిమతం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

 బీజేపీ వైపు ‘పాయల్’ చూపు..

 ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల్ శంకర్ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. బుధవారం నియోజకవర్గంలోని జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల నాయకులతో ఆదిలాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి, బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర పడి న వెంటనే జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బిల్లు విషయమై ఇన్నాళ్లు వేచి చూసే ధోరణితో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు.

 ఎంపీ రాథోడ్ రమేష్‌తో విభేదాలు

 ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్‌ల మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా కొనసాగుతోం ది. ఈ ఇద్దరు పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిం చారు. ఎంపీ నెల రోజుల క్రితం చేపట్టిన పల్లెనిద్ర విషయం లో కూడా వీరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యా యి. పార్టీ అంతర్గత సమావేశాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నగేష్ వ్యతిరేకించినట్లు చర్చ జరిగింది. మరోవైపు ఎంపీ రమేశ్ బోథ్ నియోజకవర్గంలో నగేష్ వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించారనే విమర్శలు ఉన్నాయి. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఆ వర్గం నాయకులకు పనులు ఇవ్వడం వంటివి చేశా రు. ఒక్కో సందర్భంలో ఇరువురు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం నగేష్ జాతర్లలో నిర్వహించిన ఈ సమావేశానికి రాథోడ్ రమేష్ వర్గం నాయకులకు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఈ సమావేశానికి వెళ్లవద్దని ఢిల్లీలో ఉన్న రాథోడ్ రమేష్ తన వర్గం నేతలకు ఫోన్లు చేసి చెయడం స్థానికంగా చర్చనీయాంశమమైంది.

 బోథ్‌కు టీడీపీ అభ్యర్థి కరువు

 నగేష్ టీడీపికి గుడ్‌బై చెప్పడంతో బోథ్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు పర్యాయాలు నగేష్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన తండ్రి రామారావు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement