టెలిఫోన్ కార్యాలయాలే టార్గెట్ | Telephone offices Target | Sakshi
Sakshi News home page

టెలిఫోన్ కార్యాలయాలే టార్గెట్

Apr 29 2016 2:09 AM | Updated on Sep 3 2017 10:58 PM

టెలిఫోన్ కార్యాలయాలే లక్ష్యంగా కేబుల్ వైర్లను దొంగిలించి, అందులో రాగిని విక్రయించే ముఠాను అరెస్టు చేసినట్టు సీఐ సత్యనారాయణ గురువారం తెలిపారు.

 గండేపల్లి : టెలిఫోన్ కార్యాలయాలే లక్ష్యంగా కేబుల్ వైర్లను దొంగిలించి, అందులో రాగిని విక్రయించే ముఠాను అరెస్టు చేసినట్టు సీఐ సత్యనారాయణ గురువారం తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపారకు చెందిన రూప శేషుబాబు, కంచర్ల సునీల్‌రాజా, అమ్మిశెట్టి బాలఫణీంద్ర కలిసి టెలిఫోన్ కార్యాలయాల్లో కేబుల్ వైర్లను దొంగిలించారు. అందులో రాగి తీగలను వేరుచేసి, విక్రయించారు. వీరికి పాత గుంటూరుకు చెందిన ఎస్‌కే మహమ్మద్ సహకరించాడు. గండేపల్లి టెలిఫోన్ కార్యాలయంలో గతేడాది అక్టోబర్‌లో ఈ ముఠా కేబుల్ వైర్లను దొంగిలించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నిందితులను నీలాద్రిరావుపేట వద్ద బుధవారం అరెస్ట్ చేశారు.
 
 పలు జిల్లాల్లో 35 నేరాలు
 తూర్పుగోదావరిలో 24, పశ్చిమ గోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4, ప్రకాశం, విశాఖలో ఒకొక్క నేరానికి ఈ ముఠా పాల్పడింది. వీరి వద్ద నుంచి 610 కిలోల రాగి దిమ్మెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుంది. నిందితులను పెద్దాపురం కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై రజనీకుమార్, క్రైం సిబ్బంది బి.నరసింహరావు, పి.సత్యకుమార్, జీఎస్‌ఎన్ మూర్తికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement