పుట్టిన రోజు స్వీట్లు పంచిపెట్టడానికి వెళ్తూ ఓ యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
జమ్మలమడుగు (వైఎస్సార్ జిల్లా) : పుట్టిన రోజు స్వీట్లు పంచిపెట్టడానికి వెళ్తూ ఓ యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గురులత(17) సోమవారం పుట్టినరోజు కావడంతో మధ్యాహ్నం తన సోదరునితో కలసి బైక్పై బంధువుల ఇంటికి బయలుదేరింది.
బైపాస్ రోడ్డులో వారి వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురులత అక్కడికక్కడే మృతిచెందగా ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కూతురు పుట్టినరోజు నాడే దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.