చిన్న గీత పక్కన పెద్ద గీతన్నట్టు...
సీమాంధ్ర ఎంపీల్లారా...! కేంద్రం మీద పోరాటం చేయాలంటూ ఇటీవలి కాలంలో జనసేన నాయకుడు, సినిమా నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఎంపీలు కొందరికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయట. విభజన చట్టానికి సవరణలు ప్రతిపాదించినప్పుడు పార్లమెంట్లో అయిదుగురు ఎంపీలు మాత్రమే మాట్లాడారంటూ మరోసారి గెలకడం ఆ ఎంపీలకు మరింత మంట తెప్పించిందట. ఆ మాటలపై కత్తులు నూరిన ఎంపీలు పవన్పై విరుచుకుపడటానికి సిద్ధపడగా జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దని వారించారు. అదేంటి...? మనల్ని ఇంతగా అంటుంటే వద్దంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు.
ఏడాదికిందట జరిగిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు పాల్గొన్న అనేక ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. కొన్ని చోట్ల నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్ ముగ్గురూ పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు లెక్కలేనన్ని హామీలు గుప్పించగా, విశేషానుభవం కలిగిన చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యపడుతుందంటూ పవన్ కల్యాణ్ ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. ఏపీకి రాయితీలేకాదు...! ప్రత్యేక హోదా వంటి అనేక విషయాలపై చంద్రబాబు ఏం సాధిస్తామన్నారో అన్నీ పవన్కు తెలిసినవే. అందుకే ఏడాది కాలంగా ఆయన ఏమీ అనకుండా సినిమాల్లోకెళ్లిపోయారు. అలాంటి వ్యక్తిని మనమెలా తిడతామంటూ అధినేత స్థాయి నుంచి సమాధానం రావడంతో ఎంపీలకు పాలుపోలేదట. అలాంటప్పుడు ఏడాది తర్వాతైనా ఇప్పుడెందుకు మాట్లాడాలి? అన్న ధర్మసందేహం వ్యక్తం చేయగా, ‘‘చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడమన్నట్టు...’’ ఇప్పుడు ఓటుకు నోటు కేసు మనల్ని ఇరకాటంలో పెడుతున్నందున...! దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ తిట్టించుకోవడం...! అని అసలు విషయం చెప్పడంతో ఎంపీలు కిమ్మనలేదట.