వేట్లపాలెంలో టీడీపీకి బీటలు

Tdp Leaders Jump Into Ysrcp - Sakshi

సామర్లకోట (పెద్దాపురం): సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామానికి చెందిన బొడ్డు భాస్కర రామారావు వర్గీయులు సుమారు 300 మంది సోమవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. దీంతో ఈ గ్రామంలో టీడీపీ కోటకు బీటలు పడ్డాయి. భాస్కరరామారావు స్వగ్రామం వేట్లపాలెం టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఆయనకు ఆ గ్రామంలో అనేక మంది అభిమానులు, బంధువులు ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారు. టీడీ పీ పెద్దాపురం ఎమ్మెల్యే సీటు కోసం ఆయన తీవ్ర ప్రయత్నమే చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ టికెట్‌ ఇస్తున్నట్టు ప్రచా రం చేసినా ఆ సీటు కూడా ఆయనకు ఇవ్వలేదు. ఈ నేపథ్యం లో ఆయన ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉండడంతో.. ఆయన అభిమానులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నుంచి మరోసారి విజయం సాధిస్తే భాస్కర రామారావుకు భవిష్యత్తులో టికెట్‌ గల్లంతు అవుతుందని ఉద్దేశంతో రాజప్పను ఓడించాలంటూ వారందరూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు.

టీడీపీ యువ నాయకుడు, భాస్కరరామారావు ముఖ్య అనుచరుడు గోలి శ్రీరామ్‌ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి తోట వాణి, పార్టీ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. నున్నా వెంకట్రాజు, చలికి ప్రకాష్, గోలి వెంకట్రావుతో పలువురు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోరంపూడి శ్రీరంగనాయకులు, సీనియర్‌ రాజకీయ నాయకుడు గోలి రామారావు, నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు విజయలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొబ్బరాడ సత్తిబాబు, పార్టీ జిల్లా కార్యదర్శి ఆదపురెడ్డి శ్రీనివాస్, తోట రాంజీ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top