
అచ్చెన్నా.. ఇటు చూడన్నా!
తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య రోజురోజుకీ అంతరాలు పెరిగిపోతున్నాయి.
టీడీపీలో పెరిగిపోతున్న విభేదాలు
జిల్లా వైపు కన్నెత్తి చూడని ఇన్చార్జ్ మంత్రి
నియోజకవర్గ ఇన్చార్జ్లను
పట్టించుకోని దుస్థితి
మూడు నెలలుగా ప్రత్యేక సమావేశాల్లేవ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య రోజురోజుకీ అంతరాలు పెరిగిపోతున్నాయి. వాటిని సరిచేయాల్సిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు పట్టించుకోవడం లేదు. పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జ్లతో ఆయన కనీసం సమావేశం కూడా కావడం లేదు. వారి సాధకబాధకాలు వినడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియల చేరికతో లుకలుకలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాల్లో తమ పెత్తనం అంటే తమ పెత్తనమే సాగుతుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్యటించి సమన్వయం చేయాల్సిన ఇన్చార్జ్ మంత్రి మిన్నకండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేక సమావేశాలేవీ?
వాస్తవానికి అధికార పార్టీకి చెందిన నేతల మధ్య సమన్వయం చేయడంతో పాటు పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి వారికి అవసరమయ్యే సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రధానంగా ఇంచార్జీ మంత్రిదే. అదేవిధంగా ప్రతీ నియోజకవర్గ ఇన్చార్జ్తో నిరంతరం మాట్లాడుతూ వారికి ఎదురవుతున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకని పరిష్కరించడమూ ఇతను చేయాల్సిందే. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా ఆయన గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన జిల్లాలో అడుగుపెట్టి మూడు నెలలకుపైగా సమయం దాటింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కరికంటే ఒక్కరితో కూడా నేరుగా మాట్లాడిన సందర్భం లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు.
సమన్వయం సాధ్యమేనా?
టీడీపీలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేల చేరికతో ఈ గొడవలు ఇంకా పెరిగాయి. ఆళ్లగడ్డలో గంగుల తన అనుచరులతో నేడో, రేపో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరిగెల వర్గీయులు కూడా తమ పనులు కావని ఆందోళన చెందుతున్నారు. తాము గొడవపడుతుంటే మూడో వర్గానికి లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నంద్యాలలో భూమా వర్గీయులు తమను తొక్కేస్తారనే ఆందోళనకు శిల్పా వర్గీయులు లోనవుతున్నారు. ఇప్పటికే భూమా- శిల్పాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోన్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు నందికొట్కూరు, కోడుమూరులో కూడా వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరి మధ్య సఖ్యత తెచ్చేందుకు, సమన్వయం సాధించేందుకు కృషి చేయాల్సిన ఇన్చార్జీ మంత్రి కనీసం జిల్లా గోడు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు.