ఆగని టీడీపీ దౌర్జన్యాలు

TDP Leaders Attack On YSRCP Leaders In Anantapur - Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మాజీ ఎంపీపీ దాడి 

సాక్షి, రామగిరి: పేరూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఏడుగురాకులపల్లిలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పేట్రిగిపోతున్నాయి. తమ అక్రమాలపై ఫిర్యాదు చేసి పత్రికల్లో కథనాలు రాయిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏడుగురాకులపల్లిలో సార్వత్రిక ఎన్నికలకు ముందు గొర్రెల యూనిట్లు మంజూరు చేయిస్తామంటూ దరఖాస్తుదారుల నుంచి టీడీపీ నాయకులు రూ.లక్షల్లో డబ్బు వసూలు చేసుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడం.. యూనిట్లు మంజూరు చేయించలేకపోవడం, వసూలు చేసిన మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు అసంతృప్తికి లోనయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుల అక్రమాలపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. సహించలేకపోయిన టీడీపీ నేత మాజీ ఎంపీపీ బడగొర్ల ఆంజనేయులు తన అనుచరులతో ఆదివారం ఉదయం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బాసి రామాంజినేయులు, అరకు మారెన్నలపై కర్రలతో దాడి చేశారు. తమపై బడగొర్ల వెంకటేశులు, ముత్యాలమ్మ, నాగరాజు, బూడిద రాజన్న, చిత్తరంజన్, బడగొర్ల ఆంజనేయులు తమపై దాడి చేసి గాయపరిచారని బాధితులు రామగిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులను ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌ ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top