
వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ దాడులు
సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోరుబాట పట్టిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు.
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోరుబాట పట్టిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. అనంతపురంలో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్తలతో అకారణంగా టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.టీడీపీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు ర్యాలీ చేపట్టగా, వీరిని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు టవర్ క్లాక్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీని చింపివేశారు.
ఇదేం పద్ధతంటూ ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వారు దౌర్జన్యానికి దిగారు. రాళ్ల వర్షం కురిపించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే గురునాథరెడ్డి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించినా, టీడీపీ శ్రేణులు ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరి చర్చిసెంటర్లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సమైక్యాంధ్ర నినాదాలిస్తుండగా సమీపంలోనే టీడీపీ దీక్షా శిబిరంలో ఉన్న నాయకులు అభ్యంతరం చెప్పి దాడికి యత్నించారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.