samaikya andhrapradesh
-
నేడు నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ఉదయం 10 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, సాయంత్రం 6 గంటలకు గూడూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 1న ఉదయం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోనూ, సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 2న ఆయన ఇడుపులపాయలో జరిగే రెండో ప్రజాప్రస్థానం(ప్లీనరీ)కుహాజరవుతారని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. చిత్తూరులో 26 రోజులపాటు యాత్ర: చిత్తూరు జిల్లాలో 26 రోజుల పాటు సాగిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర గురువారంతో ముగిసింది. జిల్లాలో 2013 నవంబర్ 30న ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు విడతలుగా సాగింది. మొత్తం 26 రోజుల పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన 24 మందికి చెందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తిరుపతి నియోజకవర్గంలో రెండు కుటుంబాలను ఓదార్చాల్సి ఉన్నప్పటికీ అక్కడి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉండటంతో ప్రస్తుతానికి మినహాయించారు. త్వరలో అక్కడ కూడా పర్యటిస్తారని రఘురామ్ తెలిపారు. -
ఆర్టి.. యూటీలొద్దు.. జనోద్యమం @ 119
సాక్షి నెట్వర్క్: రాయల్ తెలంగాణ (ఆర్టి)... హైదరాబాద్ యూటీ... ఇటువంటి ప్రతిపాదనలేమీ వద్దని సమైక్యాంధ్రప్రదేశ్ను యథాతథంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రజ నినదిస్తోంది. అడ్డగోలు ప్రతిపాదనలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెబుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 119వ రోజైన మంగళవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగానే సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలతో ఉద్యమాన్ని హోరెత్తించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు 119 సంఖ్య ఆకారంలో కూర్చొని సమైక్య నినాదాలు చేశారు. తిరుపతిలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. నగరంలో యువకులు భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల విధానాలు, తీరుతెన్నులపై కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో విద్యార్థులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. మున్సిపల్ కూడలి వద్ద నడిరోడ్డుపై నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు మంత్రులు, స్పీకర్, రాష్ట్ర ఎంపీల ముఖచిత్రాల మాస్క్లు ధరించి రాష్ర్ట విభజన వద్దంటూ తీర్మానించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు రాస్తారోకో చేసి మానవహారం నిర్మించారు. సీమాంధ్ర ప్రజల సమైక్య డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో సీడబ్ల్యూసీ, జీఓఎమ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల ఉద్యమపథం సమైక్యాంధ్ర పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర పరిరక్షణకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అవిరళ కృషిని వివరిస్తున్నారు. -
28 నుంచి జగన్ సమైక్య శంఖారావం
-
28 నుంచి జగన్ సమైక్య శంఖారావం
* కుప్పం నుంచి శ్రీకారం; ఓదార్పు యాత్ర కూడా * రాయలసీమ, తెలంగాణ మీదుగా శ్రీకాకుళం వరకూ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నవంబర్ 28న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమై.. రాయలసీమ, తెలంగాణల మీదుగా శ్రీకాకుళం వరకు సమైక్య శంఖారావం యాత్ర సాగుతుంది. అలాగే చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర జరగలేదు కాబట్టి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతికి తట్టుకోలేక జిల్లాలో మరణించిన వారి కుటుంబాలను యాత్ర సందర్భంగా జగన్ పరామర్శిస్తారు. సమైక్య శంఖారావం యాత్ర జిల్లాల వారీ సవివర షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్రెడ్డి, ఏ.వీ.ప్రవీణ్కుమార్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాంతీయ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిధున్రెడ్డి, జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. 2012 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జగన్ సోదరి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర ను చేశారని.. ఇప్పుడు జగన్ సమైక్యాంధ్ర లక్ష్యంగా స్వయంగా యాత్ర చేపడుతున్నారని వారు వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న కోట్లాది మంది ఆకాంక్షను చాటి చెప్పడానికే జగన్ పర్యటిస్తున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి త్యాగం చేయడానికైనా వెనుకాడబోదన్నారు. రాష్ట్రాన్ని విభజించమని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి గండ్రగొడ్డలిని ఇచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పంకు జగన్ వస్తే అడ్డుకోవాలని, ఆయన వస్తే తలుపులు మూసుకోమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్కడి ప్రజలను కోరడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కుప్పంలో సమైక్యతను కోరే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని చంద్రబాబు తనది ఏ వాదమో చెప్పకుండా జగన్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు ఉన్నారని విభజిస్తే అందరమూ నష్టపోతామనేది జగన్ వాదన అని తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేసినా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను విరమింప జేసి, అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టకుండా కిరణ్ సమైక్య పోరాటం చేస్తున్నారని ఆయన వ్యంగంగా వ్యాఖ్యానించారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టినా అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్దేశకత్వంలోనే ఉంటుందన్నారు. రాష్ట్రం, దేశం నాశనమైనా చంద్రబాబునాయడు పట్టించుకోరని, రాజకీయ స్వార్థ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని ప్రవీణ్కుమార్రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేటపుడే చాలా పెద్ద తప్పు చేస్తున్నారని తాను హెచ్చరించారని, అయినా చంద్రబాబు వినిపించుకోలేదని వెల్లడించారు. బాబు చేస్తున్న పనులకు రాష్ట్ర ప్రజలు ఆయనకు ఇప్పటికే యావ జ్జీవ కారాగార శిక్ష విధించారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు రాజకీయ ఉరిశిక్ష వేస్తారన్నారు. జగన్ బస్సు యాత్ర చేస్తారని, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తారని, మధ్యలో ఓదార్పు యాత్ర కూడా ఉంటుందని మిథున్రెడ్డి తెలిపారు. -
ముమ్మాటికీ సమైక్యమే
విభజన కోసమే మంత్రుల బృందం... జీవోఎంను మేము వ్యతిరేకిస్తున్నాం కేంద్ర హోంశాఖకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ లేఖను విడుదల చేసిన కొణతాల, మైసూరారెడ్డి సమైక్యాంధ్రను కోరుకునేవారంతా జీవోఎంను గుర్తించకుండా వ్యతిరేకించాలని పిలుపు సీఎం, చంద్రబాబు, సీమాంధ్ర మంత్రులు లోపాయికారీగా విభజనకే సహకరిస్తున్నారు బాబు చెప్పినందుకే అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలన్న వైఖరికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన జగన్ సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ను విభజించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని కోరుకునే వారందరూ జీవోఎంను గుర్తించకుండా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జీవోఎంను వ్యతిరేకించడంతో పాటు విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాసిన లేఖను వారు ఈ సందర్భంగా విడుదల చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలపై సలహాలు, సూచనలు చేయాల్సిందిగా 2013 అక్టోబర్ 30వ తేదీన హోంశాఖ నుంచి వచ్చిన లేఖకు సమాధానంగా జగన్ ఈ లేఖ రాశారని నేతలు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ తొలి నుంచీ కోరుతోందని, కేంద్రం జీవోఎంను ఏర్పాటు చేయడం, సలహాలు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయడం అనేది విభజన ప్రక్రియలో మరో ముందడుగుగా తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. అందుకే జీవోఎంను తాము వ్యతిరేకిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు సహా సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులందరూ పైకి ఒక రకంగా మాట్లాడుతూ లోపాయికారీగా విభజనకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్, బాబు.. ఇద్దరూ సోనియాగాంధీ నిర్ణయాన్ని బలపరుస్తూ విభజనకు దోహదపడుతున్నారన్నారు. విభజన విషయంలో అఖిలపక్షం వేయాలని చంద్రబాబు కూడా డిమాండ్ చేశారని, ఆయన మాట మేరకు కేంద్రం ఇప్పుడు ఆ సమావేశం ఏర్పాటు చేయ సంకల్పించిందని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న కిరణ్ ఇదే ఆఖరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అవుతుందేమోనని చెప్పడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రాన్ని విభజించకుండా పోరాటం సాగిస్తామని ఓవైపు చెబుతూ మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని కొణతాల, మైసూరారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని, ఈ పోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారా? అన్న ఒక ప్రశ్నకు.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మైసూరారెడ్డి చెప్పారు. తాము ఎక్కడికి వెళ్లినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కోరతామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేష్కుమార్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖ పూర్తి పాఠం ఈ విధంగా ఉంది... అయ్యా, ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన వివిధ సమస్యలపై మా పార్టీ సలహాలు, సూచనలు కోరుతూ 2013 అక్టోబర్ 30వ తేదీన మీరు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ను విభజించడానికి జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకించాలనేది మా పార్టీ విధానం అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. అందువల్ల రాష్ట్ర విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా మా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విభజించాలని కేంద్ర మంత్రివర్గం 2013 అక్టోబర్ 3వ తేదీన తీసుకున్న నిర్ణయం మాకు ఏమాత్రం సమ్మతం కాదు. రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు గత మూడు నెలలుగా విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ రోడ్లపై ఉన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా, వాస్తవాన్ని విస్మరించి విభజన అనే దారుణమైన అన్యాయానికి ఒడిగట్టడానికే సిద్ధమై ముందుకు వెళుతోంది. కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటైంది కూడా రాష్ట్రాన్ని విభజించాలనే ఉద్దేశంతోనే కనుక దానిని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నేపథ్యంలో సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. కృతజ్ఞతలతో... మీ వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్కు నేడు రాష్ట్రపతి అపాయింట్మెంట్! వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు అపాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. ప్రణబ్ సోమవారం హైదరాబాద్కు వస్తున్న విషయం విదితమే. హైదరాబాద్లో కలవడానికి తమకు సమయం కేటాయించాల్సిందిగా జగన్ ఇటీవల ఒక లేఖ ద్వారా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో.. సోమవారం రాత్రి రాజ్భవన్లో బస చేయనున్న రాష్ట్రపతిని 9 గంటల తరువాత కలుసుకోవాల్సిందిగా ఆయన కార్యాలయ సిబ్బంది వర్తమానం పంపినట్లు తెలిసింది. -
వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ దాడులు
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోరుబాట పట్టిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. అనంతపురంలో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్తలతో అకారణంగా టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.టీడీపీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు ర్యాలీ చేపట్టగా, వీరిని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు టవర్ క్లాక్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీని చింపివేశారు. ఇదేం పద్ధతంటూ ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వారు దౌర్జన్యానికి దిగారు. రాళ్ల వర్షం కురిపించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే గురునాథరెడ్డి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించినా, టీడీపీ శ్రేణులు ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరి చర్చిసెంటర్లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సమైక్యాంధ్ర నినాదాలిస్తుండగా సమీపంలోనే టీడీపీ దీక్షా శిబిరంలో ఉన్న నాయకులు అభ్యంతరం చెప్పి దాడికి యత్నించారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
ఏదేమైనా.. ఎందాకైనా.. ఉద్యమం ఆగదు
సాక్షి నెట్వర్క్: ఏదేమైనా... ఎందాకైనా... సమైక్యాంధ్రప్రదేశ్ను యథాతథంగా ఉంచుతామంటూ కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ నిరంతరంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ సీమాంధ్ర ప్రజ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తోంది. వరుసగా అరవయ్యో రోజు శనివారం కోస్తా, రాయలసీమ జిల్లాలు సమైక్యవాదుల నిరసనలతో దద్దరిల్లాయి. ఇక ఏపీఎన్జీవోల సంఘం పిలుపుమేరకు వరుసగా రెండోరోజూ కేంద్రప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను సమైక్యవాదులు బంద్ చేయించారు. విశాఖజిల్లా అనకాపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు సమ్మక్క సారక్క అమ్మవార్లకు తాత్కాలిక గుడికట్టారు. అక్కడే బతుకమ్మ ఆట ఆడి రాష్ట్రం సమైకంగా ఉంచాలంటూ ప్రార్థించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో జాతీయ రహ దారిపై రజకృవత్తిదారులు దుస్తులు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రిమ్స్లో సమైక్యాంధ్ర జేఏసీ నేతలు, వైద్యాధికారులను పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసనగా శనివారం చేపట్టిన జిల్లా బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వీధి దీపాలను ఆర్పివేసి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో మహిళలు బతుకమ్మ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సాయంత్రం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు జన జాగారం కార్యక్రమం నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో భవిష్యత్తులో చుక్కనీరందని దుస్థితి తలెత్తుతుందంటూ వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు ఖాళీబిందెలతో నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య ఉద్యమం మొదలై శనివారం నాటికి 60 రోజులు కావడంతో ఎస్కేయూలో పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు జాతీయ రహదారిపై ‘60 ఎస్కేయూ’ ఆకారంలో కూర్చొని రాస్తారోకో చేశారు. తిరుపతిలో మున్సిపల్ ఉద్యోగులు శ్రీవేంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని తలపై పెట్టుకొని గోవిందనామ స్మరణలు చేస్తూ ప్రదర్శన చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం చుట్టూ పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. విజయవాడలో శనివారం రాత్రి సమైక్యాంధ్ర విధ్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఎన్జీఓలు జాతీయ రహదారిపై జాగరణ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైతులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. స్వర్ణకార సంఘం సభ్యులు ప్రకాశం జిల్లా కనిగిరిలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వేలాది మంది మహిళలు సమైక్య జెండాలు చేతబూని నారి భేరి సభకు తరలివచ్చారు. రాష్ట్రం ముక్కలు కాకుండా సమైక్యంగానే ఉండాలని నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరులో మహిళా గర్జన చేపట్టారు. ఇదే జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంటలో సమైక్యగర్జన పేరిట భారీసభ నిర్వహిం చారు. ఆత్మకూరులో మహిళా గర్జన, చేజర్ల మండలం ఆదూరుబల్లి బస్టాండు సెంటర్లో ఉపాధ్యాయ గర్జన నిర్వహించారు. ప్రకాశం జిల్లా దోర్నాలలో వేలాది మంది మాదిగలు సమైక్యాంధ్ర కోసం మహాగర్జన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గురుశిష్య గర్జన నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కమ్మ గర్జన, మదనపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య గర్జన పేరిట సభలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో విద్యార్థి గర్జన విజయవంతమైంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం రణభేరిలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. విభజన భయానికి మరో నలుగురి బలి సాక్షి నెట్వర్క్: విభజన కలతతో మరో నలుగురు మృత్యువాత పడ్డారు. నెల్లూరు సరస్వతీనగర్లో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ ఎన్.రాములు(47) శనివారం ఉదయం పేపర్లో ఉద్యమ వార్తలు చదువుతూ ఉద్వేగానికి లోనై కుప్పకూలారు. చేజర్ల మండలం తిరుపతినాయుడుపల్లెకు చెందిన రాములు 1996 నుంచి నెల్లూరు రీజియన్లో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. సమైక్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఈయన మృతితో ఆర్టీసీ వర్గాల్లో విషాదం నెలకొంది. నెల్లూరు జిల్లా సంగం మండలం ఉడ్హౌస్పేటకు చెందిన ఉక్కాల రవి(42) శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన సమైక్యభేరి సభకు హాజరై తిరిగివెళుతూ మార్గమధ్యలో తరుణవాయి వద్ద గుండెపోటుకు గురై అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఇక సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న అనంతపురం జిల్లా గుంతకల్లులోని తిలక్నగర్కు చెందిన దాదావలి(25), ఉరవకొండకు చెందిన చేనేత కార్మికుడు వూడిశెట్టి శేఖర్(42) గుండెపోటుతో మృతి చెందారు. పులివెందుల పులి కేక వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన పులికేక సభలో విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు గర్జించారు. సభా ప్రాంగణం మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్జీవోలు, వ్యాపారస్తులు.. ఇలా అన్నివర్గాల ప్రజలతో కిక్కిరిసిపోయింది. మైదానంలో స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే జనం నిలబడి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఇక సభలో నేతలు మాట్లాడుతూ, రాష్ట్రం ముక్కలైతే సాగు, తాగునీటి సమస్యలు తీవ్రతరం కానున్నాయని, అన్ని మార్గాలు అన్వేషించిన శ్రీకృష్ట కమిటీ సిఫార్సుల్లోని ఆరో సూచన ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండటమే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమని.. అందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ పూర్తిస్థాయిలో కృషి చేస్తోందన్నారు. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లతోపాటు సమైక్యాంధ్రకు సంబంధించిన ఓటును కేటాయించి రెఫరండం ద్వారా తీర్పు కోరాలని డిమాండు చేశారు. విభజన జరిగితే వైఎస్ పథకాల అమలుకు విఘాతం కలుగుతుందని వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. రాయలసీమ కార్మిక, కర్షక సమితి నాయకుడు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ సతీష్రెడ్డి, కందుల రాజమోహన్రెడ్డి, జెఏసీ నేత శివప్రకాష్రెడ్డి, రాంగోపాల్రెడ్డి ప్రసంగించారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం దిగొచ్చేలా చేయనున్నట్టు ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. విశాఖలోని 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కార్మిక సంఘాల నాయకులతో శనివారం ఆయన సమావేశమై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేశారు. గాజువాకలో 4న భారీ ర్యాలీ, 5న విశాఖలో ప్రదర్శన ఉంటుందన్నారు. 4, 5వ తేదీల్లో క్యాబినెట్ నోట్ వెలువడే అవకాశం ఉందని, ఆలోగా ఎంపీలంతా రాజీనామా చేయాలని కోరారు. కర్నూలులో ఆదివారం 3 లక్షల మందితో భారీ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
అనుమతి నిరాకరణ అన్యాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో తాము నిర్వహించతలపెట్టిన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ అడ్వొకేట్స్ యాక్షన్ కమిటీ ఫర్ సమైక్యాంధ్రప్రదేశ్ కన్వీనర్ సి.వి.మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తన ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించేందుకు ఈ నెల 28న సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సమావేశం కావాలని నిర్ణయించారు, ఈమేరకు స్టేడియం నిర్వహకులైన శాప్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, సమావేశానికి వారు అనుమతినిచ్చారని, అయితే పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరని చెప్పడంతో, తాము ఈ విషయాన్ని సైబరాబాద్ కమిషనర్, మాదాపూర్ డీసీపీల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరామని వివరించారు. అయితే తమ అభ్యర్ధనను పోలీసులు తిరస్కరించారని, గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండటం వల్ల అక్కడ సమావేశాలకు అనుమతినివ్వలేమని చెప్పారని, ఈ కారణం ఎంత మాత్రం సరైనది కాదని ఆయన తెలిపారు. సమావేశం కావాలనుకుంటున్నది న్యాయవాదులు మాత్రమేనని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమావేశం నిర్వహించుకుంటామంటే అనుమతినివ్వకపోవడం అన్యాయమని ఆయన కోర్టుకు నివేదించారు. అదే ప్రాంతంలో సమావేశం నిర్వహించుకునేందుకు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సైతం దరఖాస్తు చేసిందని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి తమకు తెలిసి అటువంటి దరఖాస్తు ఏదీ లేదని ఆయన తెలిపారు. తమ సమావేశం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పోస్టర్లు విడుదల జరిగిందని, సీమాంధ్రలోని అన్ని బార్ అసోసియేషన్లకు సమాచారం వెళ్లిందని, సమావేశంలో పాల్గొనేందుకు న్యాయవాదులంతా తగిన ఏర్పాట్లు చేస్తున్నారని అశోక్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సమావేశం నిర్వహిస్తాం: మోహన్రెడ్డి శనివారం తాము నిర్వహించతలపెట్టిన సమావేశం యధాతధంగా జరుగుతుందని మోహన్రెడ్డి తెలిపారు. తమ సమావేశానికి అనుమతివ్వపోవడానికి పోలీసులు చెప్పిన కారణాలు ఎంత మాత్రం సహేతుకంగా లేవని చెప్పారు. కేసు విచారణ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శాంతియుతంగా తాము సమావేశం నిర్వహించుకుంటామని, ఈ విషయంలో కోర్టు తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. గతంలో కోర్టు ఇటువంటి సమావేశాలకు పలుమార్లు అనుమతులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. -
తెలంగాణలోనూ ‘సమైక్య’ సభలు: అశోక్బాబు
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్కు మద్దతుగా రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో బహిరంగసభలను నిర్వహించేందుకు ఏపీఎన్జీవో నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గన్ఫౌంఢ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్బాబు వివరాలను వెల్లడించారు. ఈనెల 20న విజయవాడ, 21న విశాఖపట్నం, 23న హిందూపురం, 24న కడప జిల్లాల్లో బహిరంగసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగసభ తర్వాత తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులు మరికొన్ని సభలు నిర్వహించాలని తమకు సూచించినట్లు చెప్పారు. ఆ మేరకు తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా పలు బహిరంగ సభలు పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం సీమాంధ్రతోపాటు తెలంగాణ జిల్లాల్లోనూ ఉందన్నారు. జోన్-1, 2 పరిధిలో వందలాది గ్రామాలు అంధకారంలో నిలిచిపోయాయని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు 72 గంటలు సమ్మె చేస్తేనే పరిస్థితి ఇలా ఉంటే నిరవధికంగా చేస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు సరికాదంటూ కొందరు ప్రజాప్రతినిధులు మాట్లాడడం బాధాకరమని, కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ప్రజా ప్రతినిధుల రాజీనామాలే సరైన మార్గమని చెప్పారు. సీమాంధ్రలోని ఎంపీలు, సీమాంధ్ర కేంద్రమంతులతో కలిసి ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకులను మరోసారి కలుస్తామని తెలిపారు. ఏపీఎన్జీవోస్ కార్యాలయానికి భద్రత కల్పిస్తామని పోలీసులు చెబుతున్నా, తమకు ఎలాంటి భద్రత అవసరం లేదని చెప్పారు.