గూడెం గుండెల్లో ముగ్గురు | Tadepalligudem municipal elections Three leaders key role | Sakshi
Sakshi News home page

గూడెం గుండెల్లో ముగ్గురు

Mar 12 2014 1:55 AM | Updated on Sep 2 2017 4:35 AM

తాడేపల్లిగూడెం మునిసిపల్ చరిత్రలో డాక్టర్ కోడే వెంకట్రావు, ఈలి ఆంజనేయులు, కర్రి సోమేశ్వరరావులకు విశిష్ట స్థానం ఉంది.

తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : తాడేపల్లిగూడెం మునిసిపల్ చరిత్రలో డాక్టర్ కోడే వెంకట్రావు, ఈలి ఆంజనేయులు, కర్రి సోమేశ్వరరావులకు విశిష్ట స్థానం ఉంది. హుందా రాజకీయూలు నడపటంలోను.. పట్టణాన్ని అభివృద్ధి వైపు పయనింపచేయడంలోనూ ఆ ముగ్గురూ కీలక పాత్ర పోషించారు. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీకి 1960లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో డాక్టర్ కోడే వెంకట్రావు చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యూరు. పేదల డాక్టర్‌గా పేరొందిన ఆయన ఎలాంటి మొండి జబ్బునైనా ఇట్టే వదిలించే వారని ప్రతీతి. 1958లో పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా ఎదిగిన ఈ పట్టణానికి విలువలకు ప్రాణమిచ్చే.. హుం దాతనం గల వ్యక్తిని తొలి అధ్యక్షునిగా ఎంపిక చేయాలని అప్పటి రాజ కీయ పెద్దలు నిర్ణయించారు. అందులో భాగంగానే డాక్టర్ కోడే వెంకట్రావును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఏడేళ్ల పాటు ఆయన పట్టణాన్ని పాలించారు. 
 
 పట్టణ రూపశిల్పి ఈలి ఆంజనేయులు
 చదివింది ప్రాథమిక విద్యే అయినా వ్యాపారంలో దిట్టగా.. విషయాల ఆకళింపులో అప్ టు డేట్‌గా ఉండే వ్యక్తిగా పేరొందిన ఈలి ఆంజనేయులు మునిసిపల్ రెండో దఫా ఎన్నికల్లో చైర్మన్‌గా ఎన్నికయ్యూరు. ప్రాతఃకాల వేళ దంతధావనం సమయం నుంచే ప్రజా దర్బార్ ప్రారంభించి సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారనే పేరు ఆయనకు లభించింది. ప్రధాన మౌలిక వసతుల కల్పించడం ద్వారా పట్టణ రూపశిల్పిగా ఆంజనేయులు పేరొందారు. ఆయన తర్వాత కర్రి సోమేశ్వర్రావు వంటి వారు విలువలతో కూడిన రాజకీయాలు నెరిపి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement