
లక్ష్యం కనుమరుగు
ప్రశాంతతకు, పచ్చదనానికి మారు పేరు పల్లెలు..పచ్చగా ఉండే పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధన ఓ కల..దానికి పెట్టిన పేరు స్వచ్ఛభారత్..దీని ఉద్దేశ్యం ఘనమైనదే
ప్రశాంతతకు, పచ్చదనానికి మారు పేరు పల్లెలు..పచ్చగా ఉండే పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధన ఓ కల..దానికి పెట్టిన పేరు స్వచ్ఛభారత్..దీని ఉద్దేశ్యం ఘనమైనదే..అయితే అమలులోకి వచ్చేసరికి పథకం తుస్సుమంటోంది. స్వచ్ఛభారత్లో కీలకమైన వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణాలను ప్రోత్సహించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత ఆసక్తితో మరుగుదొడ్డి నిర్మాణానికి ముందుకు వచ్చిన వారిని కూడా ప్రోత్సహించకపోవడంతో సంపూర్ణ పారిశుద్ధ్యం పల్లెల్లో అసంపూర్తిగానే మిగిలిపోయే పరిస్థితి.
‘ప్రతి గ్రామంలో మరుగుదొడ్డి నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి పథకాన్ని మంజూరు చేయాలి’. ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఎం.ఎం.నాయక్ చేసిన వాఖ్యలివి, గతంలో ఉన్న కలెక్టర్ కూడా ఇదే తరహాలో సంబంధిత శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసినా నిర్దేశించిన లక్ష్యంలో 10 శాతం కూడా పూర్తి కాలేదు. దీంతో గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం కలగానే మిగిలిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.స్వచ్ఛభారత్లో కీలకమైన బహిరంగమలవిసర్జన నిరోధంలో అధికారులు విఫలమవుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలోనే ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి 2012లో శ్రీకారం చుట్టినా ఆపథకాన్ని బాలారిష్టాలు వీడడం లేదు.
విజయనగరం మున్సిపాలిటీ: జిల్లాలో 26వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా గతంలో నిర్ణయించినా ఆ స్థాయిలో నిర్మాణాలు జరగలేదు. సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్య మిస్తున్నప్పటికీ కార్యాచరణలో విఫలమవుతోంది. 2012 డిసెంబర్లో జిల్లాలో ఐఎస్ఎల్ నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 26వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకుగాను ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లాలో 8, 276 ఐఎస్ఎల్ యూనిట్లను మంజూరు చేయగా.. ఇప్పటి వరకు ఐదు వేల వరకు నిర్మాణాలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 3, 276 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది.
పథకం అమలుకు శాఖ మార్పు
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతలను పథకం ప్రారంభంలో అప్పటి ప్రభుత్వం ఉపాధి హమీలో అమలు చేసింది. అయితే తాజాగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకం అమలు బాధ్యతలను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు అప్పగిస్తూ నవంబర్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మంజూరై ప్రగతిలో ఉన్న యూనిట్లను వచ్చే ఏడాది మార్చి 15లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. ప్రారంభానికి నోచుకోని యూనిట్ను రద్దు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిపై అధికారులు దృష్టిసారించగా నూతనంగా యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతుల మంజూరు నిలిపివేశారు. యూనిట్ విలువ పథకం ప్రారంభంలో రూ.10వేలు ఉండగా... ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.12వేలకు పెంచారు. ఇందులో రూ.10వేలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం కోసం, మిగిలిన రూ.2వేలు మరుగుదొడ్డిలో కుళాయి కనెక్షన్ కోసమని అధికారులు చెబుతున్నారు. పెంచిన మొత్తం ప్రస్తుతం ప్రగతిలో ఉన్న వాటికి వర్తించదని నూతనంగా మంజూరైతే వాటికి వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
దరఖాస్తులు వస్తున్నా..మంజూరు నిలిపివేతపై విమర్శల వెల్లువ
వ్యక్తిగత మరుగుదొడ్డి యూనిట్ విలువ రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచడంతో లభ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు ప్రజలను చైతన్య పరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈపథకం అమలు బాధ్యతలను ఇప్పటివరకు ఆర్డబ్ల్యూఎస్, ఐకేపీ, డ్వామా శాఖలు చూస్తున్నాయి. అయితే ఇందులో ఏ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే తమ పని పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఆయా గ్రామాల్లోని ప్రజలది.
దరఖాస్తులకు టైమ్ అయిపోయిందట
వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి దరఖాస్తులు చేసుకోండని చెప్పారు. తీరా దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే టైమ్ అయిపోయిందన్నారు. గ్రామంలో కొంతమందే దరఖాస్తులు పెట్టారు. పెట్టినోళ్లకు, పెట్టనోళ్లకు ఎవరికీ మరుగుదొడ్లు రాలేదు. అదీకాకుండా విడతలు విడతలుగా రూ.10వేలు బిల్లులిస్తాం. ముందు మరుగుదొడ్లు నిర్మించుకోండన్నారు. దీంతో పెట్టుబడి పెట్టలేక కొంతమంది దరఖాస్తు చేసేందుకు వెనుకడుగేశారు.
నాలి గుంప స్వామి,
పూజారిగూడ, కొమరాడ మండలం
ప్రచార ఆర్భాటమే..!
గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ప్రచారాన్ని ఆర్భాటంగా చేస్తోంది. రూ.10వేలు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తామని, ప్రతి ఇంట మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెబుతున్నారు. దరఖాస్తులు చేసుకుని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ వాటికి అతీగతీ లేదు. దీంతో మరుగు లేక మహిళలు అవస్థలు పడుతున్నారు.
నర్సిపురం సంగమేశు,
మాజీసర్పంచ్, వన్నాం పంచాయతీ