
వీఆర్ కళాశాల
నెల్లూరు (టౌన్): సుప్రీం కోర్టులో ఆనం సోదరులకు ఎదురుదెబ్బ తగిలింది. వీఆర్ విద్యాసంస్థల కమిటీపై ఏబీవీపీ పూర్వ విద్యార్థులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు చాలా ఏళ్లు కొనసాగింది. హైకోర్టులో పూర్వవిద్యార్థులకు గతంలో అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనం సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఈ కేసుపై పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం మంగళవారం పాత కమిటీని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కొత్త కమిటీని జూలైలోపు ఎన్నుకోవాలంటూ తీర్పు జారీ చేసింది. జిల్లా కోర్టు పర్యవేక్షణలో పాత రాజ్యాంగం ప్రకారం ఎన్నిక జరపాలని నిర్ణయించింది. దీంతో సుప్రీం కోర్టులో ఆనం సోదరులకు ఎదురుదెబ్బ తగిలింది. వీఆర్ విద్యా సంస్థలకు సుమారు రూ.1,000 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఈ సంస్థలు దాదాపు 31 ఏళ్ల నుంచి ఆనం సోదరుల అధీనంలో నడుస్తున్నాయి. అక్కడ నిధులు దుర్వినియోగం అయ్యాయని, కమిటీ ఎన్నిక సక్రమంగా జరగలేదంటూ ఏబీవీపీ పూర్వ విద్యార్థి ఆమంచర్ల శంకరనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వీఆర్ విద్యాసంస్థలకు కొత్త కమిటీ అనివార్యమైంది.