జిల్లాలో పల్స్ పోలియో విజయవంతం.. | successes of pulse polio in district | Sakshi
Sakshi News home page

జిల్లాలో పల్స్ పోలియో విజయవంతం..

Feb 25 2014 2:29 AM | Updated on Sep 2 2017 4:03 AM

జిల్లాలో 2.98లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కల మందు వేయాలని లక్ష్యం నిర్ధేశించుకుని 2.78లక్షల మందికి వేశామని డీఎంహెచ్‌ఓ భానుప్రకాష్ తెలిపారు.

 కూసుమంచి, న్యూస్‌లైన్: జిల్లాలో 2.98లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కల మందు వేయాలని లక్ష్యం నిర్ధేశించుకుని 2.78లక్షల మందికి వేశామని డీఎంహెచ్‌ఓ భానుప్రకాష్ తెలిపారు. మిగిలిన వారికి కూడా సోమ, మంగళవారాలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పూర్తి చేస్తామని అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పాలేరు, నర్సింహులగూడెం, చౌటపల్లి గ్రామల్లో ఇంటింటి సర్వేను పరిశీలించారు. అనంతరం కూసుమంచి పీహెచ్‌సీని తనిఖీ చేసి విలేకరులతో మాట్లాడారు.

 జిల్లా ప్రధాన ఆస్పత్రిలో డెంగీ, మలేరియా పరీక్షల నిర్ధారణకు ఆరుగురు ల్యాబ్ టెక్నిషియన్లను నియమించామని, జిల్లాలో 61 వైద్యాధికారుల పోస్టులు ఖాళీ ఉండగా 59 భర్తీ చేశామని, మిగిలిన ఇద్దరు త్వరలో విధుల్లో చేరతారని తెలిపారు.  జనాభా ప్రాతిపదికన జిల్లాలో మరో 32 పీహెచ్‌సీలు అవసరం ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వాటిల్లో నాలుగు పీహెచ్‌సీలు మంజూరయ్యాయని అన్నారు. జిల్లాలో 33 మంది స్టాఫ్ నర్సుల భర్తీకి సం బంధించి ఎంపికైన వారి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోందని, త్వరలోనే వీరు విధుల్లో చేరుతారని అన్నారు.

భారత దేశం పోలి యో రహిత దేశంగా ఈ నెల 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని అన్నారు. పీహెచ్‌సీల పని తీరును మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నామని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మెడికల్ ఆఫీసర్ శంకర్‌కుమార్‌నాయక్ పాల్గొన్నారు.

 59 మంది వైద్యాధికారులను నియమించాం
 నేలకొండపల్లి:  జిల్లాలో 59 మంది వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భానుప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలియో చుక్కల కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 61 సార్లు పోలియో చుక్కల మందును పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలో 3327 బూత్‌లు, 3308 మొబైల్ పార్టీల ఏర్పాటు చేసి చుక్కల మందు పంపిణీ చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా 2.98 లక్షల మందికి పోలియో చుక్కల మందు వేశామని అన్నారు. ఈ సమావేశంలో క్లస్టర్ అధికారి మోహన్‌రావు, మం డల వైద్యాధికారి సురేష్‌నారాయణ, దంత వైద్యులు మురళీకృష్ణ, స్వప్న, నివేదిత, పార్మసిస్ట్ అప్పారావు, హెచ్‌ఈఓ జగదీశ్వర్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement