వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరిలో నిర్వహించిన సమరదీక్షకు ప్రజలు స్వచ్ఛందంగా
తణుకు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరిలో నిర్వహించిన సమరదీక్షకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనపై విసుగెత్తిన ప్రజలు సమరదీక్షకు పోటెత్తారన్నారు. అన్నివర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలిపారని కారుమూరి చెప్పారు. జన స్పందనను చూసి ఈర్ష పడిన ప్రభుత్వం దీక్షా శిబిరం వద్ద కనీస భద్రత కూడా ఏర్పాటు చేయలేదని, ప్రతిపక్ష నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజాధన దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. చెరువులను తవ్వే పేరుతో గట్లు పటిష్టం చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తెగనమ్ముకుంటున్నారని కారుమూరి విమర్శించారు.
వేల్పూరుకేనా అభివృద్ధి?
నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి ఒక్క వేల్పూరుకే వరాల జల్లు కురిపించడం ఎంతవరకు సమంజసమని కారుమూరి ప్రశ్నించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ అభివృద్ధికై నిధులు కోరాల్సింది పోయి కేవలం వేల్పూరు గ్రామాభివృద్ధికే నిధులు ఇవ్వమని ఎమ్మెల్యే కోరడం దారుణమన్నారు. ఎమ్మెల్యే కొనుగోలులో రేవంత్రెడ్డి, డబ్బు సంచి వ్యవహారంలో మంత్రి పీతల సుజాత విషయంలో చంద్రబాబు నోరు విప్పకపోవడం సిగ్గు చేటని కారుమూరి విమర్శించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి సునంద, మండపాక సర్పంచ్ ఉండవల్లి జానకి, నాయకులు ఎస్ఎస్ రెడ్డి, చోడే జోషి, కడియాల సూర్యనారాయణ, మద్దిరాల రామసతీష్ తదితరులు పాల్గొన్నారు.