సాగర్కు 1,24,886 క్యూసెక్కులు
గరిష్ట స్థాయి దిశగా శ్రీశైలం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్ (మాచర్ల): శ్రీశైలం జలాశయంలో నీటి మట్టాన్ని గరిష్ట స్థాయిలో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుతుండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జూరాల, హంద్రీ, సుంకేసుల నుంచి 1,71,794 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర తెరిచి 55,874 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. రెండు పవర్ హౌస్లలో ఉత్పాదన అనంతరం మరో 69,012 క్యూసెక్కులతో కలిపి సాగర్కు 1,24,886 క్యూసెక్కులను వదులుతున్నారు. సోమవారం సాయంత్రం జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది.
సాగర్ నుంచి 1,10,184 క్యూసెక్కులు దిగువకు
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా సోమవారం నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీటి రాక తగ్గటంతో ఆదివారం 10 క్రస్ట్ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీటిని తగ్గించి నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. సాగర్ జలాశయ నీటిమట్టం 589.50 అడుగుల వద్ద ఉండగా.. ఇది 310.5510 టీఎంసీలకు సమానం. సాగర్ నుంచి మొత్తం ఔట్ ఫ్లోగా 1,10,184 క్యూసెక్కులు విడుదలవుతోంది.