ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి | Sreenth Devireddy Appointed as Andhra Pradesh Press Academy Chairman | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి

Nov 8 2019 1:03 PM | Updated on Nov 8 2019 8:08 PM

Sreenth Devireddy Appointed as Andhra Pradesh Press Academy Chairman - Sakshi

దేవిరెడ్డి శ్రీనాథ్

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీనాథ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహిత జర్నలిస్టు కూడా.

సీఎం జగన్ ఆశయాల మేరకు పనిచేస్తా
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీనాథ్ దేవిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలన్న సీఎం జగన్ ఆశయ సాధన దిశగా పనిచేస్తానని ఆయన చెప్పారు. డిజిటల్ యుగంలో మీడియా రంగంలో పెరిగిన ఆధునిక సాంకేతిక వినియోగం, అలాగే సోషల్ మీడియా విస్తృతి నేపథ్యంలో ముఖ్యంగా గ్రామీణ జర్నలిస్టులకు సరైన దిశగా పునశ్చరణ అవసరమని, అందుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement