టీడీపీ నాయకుడు, మండల పరిషత్ వైస్ఎంపీపీ భర్త గెంజి వెంకటరమణ ఎస్ఐ ముందే రావికమతం స్టేషన్లో గురువారం వీరంగం సృష్టించాడు.
ఎస్ఐ ముందే టీడీపీ నాయకుని వీరంగం
రావికమతం: టీడీపీ నాయకుడు, మండల పరిషత్ వైస్ఎంపీపీ భర్త గెంజి వెంకటరమణ ఎస్ఐ ముందే రావికమతం స్టేషన్లో గురువారం వీరంగం సృష్టించాడు. మచ్చా శ్రీను అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోపోద్రిక్తుడైన సదరు నాయకుడు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదిని బెదిరించడమే కాక ఎస్ఐ ముందే చేయి చేసుకున్నాడు. దీనిపై రావికమతం ఎస్ఐ కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. రావికమతం వైఎస్ఎంపీపీ గెంజి కనక భర్త వెంకట రమణ ఐదు రోజుల క్రితం హాస్టల్ స్థలం ఆక్రమణకు యత్నించాడు.
అక్కడి విలువైన చెట్టును కూడా నరికేశాడు. అలాగే రావికమతం హైస్కూల్ ప్రహరీ నాణ్యత లేకుండా నిర్మిస్తున్నాడంటూ గ్రామానికి చెందిన మచ్చా శ్రీను ఎంపీడీవో, విలేకర్లకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం చెందిన వెంకట రమణ బుధవారం రాత్రి శ్రీను ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశాడు. ఈ మేరకు బాధితుడు రావికమతం ఎస్ఐకు గురువారం ఫిర్యాదు చేశాడు. ఇది తెలిసి వెంకటరమణ గురువారం స్టేషన్కు వెళ్లి ఎస్ఐ సురేష్కుమార్తో పాటు అందరూ చూస్తుండగానే శ్రీనుపై చేయి చేసుకున్నాడు. దీంతో కొందరు ఫోన్ చేయడంతో కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు ఎకాయెకిన రావికమతం స్టేషన్కు వచ్చి సదరు నాయకున్ని తీవ్రంగా మందలించారు. ఆపై తదుపరి చర్యలకు ఆదేశించి వెళ్లిపోయారు. శ్రీను ఫిర్యాదు మేరకు వెంకటరమణపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.