జగనన్న వదిలిన బాణం దూసుకుపోతోంది. ఇప్పటికే మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో జిల్లా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న షర్మిల సమైక్య శంఖారావం పేరిట మళ్లీ ప్రజలకు చేరువయ్యేందుకు బస్సుయాత్ర రూపంలో జిల్లాకు వస్తున్నారు.
షర్మిల బస్సుయాత్రను విజయవంతం చేయండి
Sep 13 2013 5:37 AM | Updated on Sep 27 2018 5:56 PM
విజయనగరం టౌన్, న్యూస్లైన్: జగనన్న వదిలిన బాణం దూసుకుపోతోంది. ఇప్పటికే మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో జిల్లా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న షర్మిల సమైక్య శంఖారావం పేరిట మళ్లీ ప్రజలకు చేరువయ్యేందుకు బస్సుయాత్ర రూపంలో జిల్లాకు వస్తున్నారు. ఈ నెల 15న జిల్లాలో జరిగే షర్మిల బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమన్వయకర్తలు, కార్యకర్తలు విశేష కృషి చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకునే ఏకైక పార్టీగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్,టీడీపీ నాయకుల కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త పాటుపడాలని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గ్రామగ్రామాన పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. అదేవిధంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నేటి నుంచి పార్టీఆధ్వర్యంలో రిలే దీక్షలు, కార్యక్రమాలు చేపట్టాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, సమైక్యాంధ్రను సాధించే వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు చేస్తున్న 48 గంటల బంద్కు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని చెప్పారు.
సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, అవనాపు విజయ్, డాక్టర్ గేదెల తిరుపతి, కోట్ల సూర్యనారాయణ, పార్టీ నాయకులు గొర్లె వెంకటరమణ, సింగుబాబు, డాక్టర్ సురేష్బాబు, చెల్లూరు ఉగ్రనర సింగరావు, నామాల సర్వేశ్వరరావు, అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement