ఏపీ అభివృద్ధికి చైనాతో ఒప్పందాలు | several agreements signed during chandrababu naidu china tour | Sakshi
Sakshi News home page

ఏపీ అభివృద్ధికి చైనాతో ఒప్పందాలు

Jun 30 2016 7:23 PM | Updated on Jul 28 2018 7:54 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటన ముగిసింది. ఐదోరోజు పర్యటనలో చివరి రోజయిన గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చైనా కంపెనీలు ఆరు ప్రాథమిక అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

గియాన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటన ముగిసింది. ఐదోరోజు పర్యటనలో చివరి రోజయిన గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చైనా కంపెనీలు ఆరు ప్రాథమిక అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చంద్రబాబు సమక్షంలో ఈ ఎంఓయూలు  చేసుకున్నారు. ఆరు కంపెనీల పక్షాన  కంపెనీల ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ శ్రీ జాస్తి కృష్ణకిశోర్ సంతకాలు చేసి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

పవర్ చైనా గిజో ఇంజనీరింగ్ కార్పోరేషన్
పవర్ చైనా గిజో ఇంజనీరింగ్ కార్పోరేషన్ వచ్చే పదేళ్లలో దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టనుంది.  ఏపీ జిల్లాలలో మౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక విద్యుత్తు, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పారిశ్రామికాభివృద్ధికోసం పవర్ చైనా గిజో ఇంజనీరింగ్ కార్పోరేషన్ పదేళ్లలో దశలవారీగా ఏటా పెట్టుబడులు పెడుతుంది. ఇందువల్ల 10 వేల నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. ఉభయులూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిశ్చయించారు.  ఒప్పంద పత్రాలపై పవర్ చైనా గిజో ఇంజనీరింగ్ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ గో వీ , ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఇఓ శ్రీ జె. కృష్ణ కిశోర్ సంతకం చేశారు.

చైనా స్టేట్ కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కంపెనీ లిమిటెడ్

చైనా స్టేట్ కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కంపెనీ లిమిటెడ్ (సి.ఎస్.సి..సి4) ప్రతినిధి హె టింగ్ , ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఇఓ శ్రీ జె. కృష్ణ కిశోర్ సంతకం చేశారు. చైనా స్టేట్ కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందిస్తుంది. నిర్మాణ కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుపర్చే కృషిలో తన పెట్టుబడులు, టెక్నాలజీ, అనుభవంతో  ఏపీకి తోడ్పాటు అందిస్తుంది.

సౌత్ హ్యూటన్ కంపెనీ లిమిటెడ్
సౌత్ హ్యూటన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏపీలో పట్టణాభివృద్ధికి సహకారం పై అవగాహనకు వచ్చాయి. రాష్ట్రంలోని పురపాలక సంఘాలలో మంచినీటి సరఫరా, డ్రెయినేజీ, సీవేజీ ట్రీట్‌మెంట్, వినియోగానికి అనువుగా సముద్రపు నీటిని డీసాలినేషన్  చేసే ప్రాజెక్టుల్లో సౌత్ హ్యూటన్ కంపెనీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టనుంది. ఒప్పంద పత్రాలపై సౌత్ హ్యూటన్ కంపెనీ ప్రెసిడెంట్ ఝిక్వి కై,జిఐఐసి సీఈఓ ఝాంగ్ ఝావో  సంతకం చేశారు.

గిజో చాంగ్ తైయువాన్ ఎనర్జీ-సేవింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ లిమిటెడ్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నెలకొల్పనున్న ‘బిల్డింగ్ మెటీరియల్ మ్యాన్యుఫాక్చర్ పార్కు’ నిర్మాణంలో ‘గిజో చాంగ్ తైయువాన్ ఎనర్జీ-సేవింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ లిమిటెడ్’ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుంది. ఒప్పంద పత్రాలపై గిజో చాంగ్ తైయువాన్ ఎనర్జీ-సేవింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ లిమిటెడ్ తరపున కంపెనీ సీఈఓ ఝు యాంగ్ హాంగ్ సంతకం చేశారు.

ఎసెడ్రిల్స్ రాక్ టూల్స్ కంపెనీ లిమిటెడ్
ఎసెడ్రిల్స్ రాక్ టూల్స్ కంపెనీ లిమిటెడ్  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ భవన నిర్మాణ రంగంలో అధునాతన టెక్నాలజీ సమకూరుస్తుంది.  భవన నిర్మాణ రంగానికి ఉపకరించే రాతి పనిముట్లు, డ్రిల్లింగ్ పరికరాలు, గనుల తవ్వకంలో అధునాత సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చటం, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు గణనీయంగా ఉపాధి అవకాశాల లభిస్తాయి. ఒప్పందంపై ఎసెడ్రిల్స్ రాక్ టూల్స్ కంపెనీ లిమిటెడ్ పక్షాన ఎండీ   ఝు గాంగ్  సంతకం చేశారు.

గిజో మారీటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్
గిజో  మారిటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే ‘ఇండస్ట్రియల్ పార్కు’లో ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుంది. ప్రాజెక్టుకు రూపకల్పన, నిర్మాణంలో సహకారం అందిస్తుంది. పెట్టుబడులు తీసుకురావటంలో గిజో  మారిటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ తోడ్పడుతుంది.  ఒప్పందంపై కార్పోరేషన్ తరపున జీఐఐసీ సీఇఓ ఝాంగ్ ఝావో సంతకం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement