తప్పుదోవ పట్టిస్తున్న సీమాంధ్ర నేతలు: ఎంపీ గుత్తా | seemandhra leaders play drama over bifurcation, says sukhender reddy | Sakshi
Sakshi News home page

తప్పుదోవ పట్టిస్తున్న సీమాంధ్ర నేతలు: ఎంపీ గుత్తా

Aug 25 2013 8:50 PM | Updated on Oct 22 2018 9:16 PM

తప్పుదోవ పట్టిస్తున్న సీమాంధ్ర నేతలు: ఎంపీ గుత్తా - Sakshi

తప్పుదోవ పట్టిస్తున్న సీమాంధ్ర నేతలు: ఎంపీ గుత్తా

సీమాంధ్ర నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు.

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుందని, విభజనకు సంబంధం లేకుండా సీమాంధ్రుల ఆందోళనలపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రకటించినా సీమాంధ్ర నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షపై ఆయన మాట్లాడుతూ...నిజాం కాలంనాటి చంచల్‌గూడ జైలులో సీమాంధ్రకు మద్దతుగా దీక్ష చేసే అర్హత జగన్‌కు లేదన్నారు.
 
 తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడేలా దీక్ష చేయదల్చుకుంటే అభ్యంతరం లేదని, దీక్ష మాత్రం సీమాంధ్ర జైళ్లలో చేసుకోవచ్చన్నారు. జగన్‌ను సీమాంధ్ర జైలుకు తరలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని కోరారు. సీమాంధ్రుల ఉద్యమం శవంతో సమానమని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల దీక్షలపై స్పష్టమైన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ఎంపీలు పవిత్రమైన పార్లమెంటులో వీధినాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌పై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ ఎంపీల సస్పెన్షన్ విషయంలో నోరు మెదపకపోవడంతోనే ఆయన నైజం బయటపడిందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement