అధికార పార్టీ నాయకుల వేధింపుల వల్లే ఎస్ యానాం గ్రామ సర్పంచ్ పెట్టా వెంకట్రావు ఆకస్మిక మృతి చెందారని
ఉప్పలగుప్తం : అధికార పార్టీ నాయకుల వేధింపుల వల్లే ఎస్ యానాం గ్రామ సర్పంచ్ పెట్టా వెంకట్రావు ఆకస్మిక మృతి చెందారని, ఇది ముమ్మాటికీ అధికార పార్టీ హత్యేనని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. మంగళవారం రాత్రి సర్పంచ్ వెంకట్రావు మృతి చెందారు. బుధవారం ఎస్.యానాంలో ఆయన కుటుంబసభ్యులను రాజబాబు పరామర్శించారు. వెంకట్రావు భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వెంకట్రావు ైవె ఎస్సార్సీపీకి అనుకూల సర్పంచ్ కావడంతో అధికార పార్టీ నాయకుల వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. అతడిపై కక్ష సాధింపుతో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి పదవి నుంచి తప్పించారన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వెంకట్రావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సర్పంచ్ పదవి దక్కించుకున్నారన్నారు.
అయినా అధికార పార్టీ నాయకులు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేసి రెండోసారి సర్పంచ్ పదవి నుంచి తప్పించారన్నారు. మళ్లీ కోర్టు ఉత్తర్వుల ద్వారా గత నెల 10న సర్పంచ్గా తిరిగి బాధ్యతలు స్వీకరించారన్నారు. దీనిని జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు మాన సిక ఒత్తిడికి గురి చేశారని, ఆ క్రమంలోనే ఆయన మృతి చెందారన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బద్రి బాబ్జి, ఎంపీపీ శిరంగు సత్తిరాజు, పార్టీ నాయకులు దంగేటి రాంబాబు, మోటూరి సాయి, పినిపే జయరాజ్, జోగి రాజా, పుగాకు శ్రీను, జోగి అర్జునరావు, బడుగు శ్రీను, తాడి గోపాలకృష్ణ, యాళ్ళ లక్ష్మీనారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
విజయసాయిరెడ్డి పరామర్శ
వెంకట్రావు కుటుంబాన్ని బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మెహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున ఆయన తరఫున కూడా వెంకట్రావుకు సంతాపం తెలిపారు. మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్ వెంకట్రావు కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించారు.