కేంద్ర హోంమంత్రి అమిత్షా సభకు రావాలంటూ విపక్షాల పట్టు
ఉభయసభలు పలుమార్లు వాయిదా
నిరసనలు ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవన్న రాజ్యసభ ఛైర్మన్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మూడో వారం సైతం అధికారపక్షంపై విపక్షాల మంటలు ఆరడం లేదు. జంతర్మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు చితకబాదిన ఉదంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సభలో ప్రకటన చేయాలంటూ సోమవారం లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టడంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది.
రామమందిర్ విరాళాల చోరీ వ్యవహారంపైనా విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు వెల్లోకి దిగి నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను కొనసాగించాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విన్నవించినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
అనంతరం తిరిగి సమావేశమైనా పరిస్థితి మారకపోవడంతో మరోసారి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అయితే రెండో వాయిదాకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు–2026ను ప్రవేశపెట్టారు. కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్లు–2026ను సభ ముందుంచారు.
ఆందోళనల మధ్యే బిల్లుకు ఆమోదం..
అనంతరం తిరిగి 2 గంటలకు లోక్ సభ ప్రారంభమయ్యాక విపక్ష ఎంపీల ఆందోళనల మధ్యే సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెరుగుతున్న కేసుల పెండింగ్ను పరిష్కరించడానికి, సుప్రీంకోర్టు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచాలని ప్రతిపాదిస్తూ బిల్లును తెచ్చారు.
సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల పెండింగ్ను తగ్గించి, న్యాయ విచారణలను వేగవంతం చేయాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ తెలిపారు. బిల్లుపై క్లాజ్ల వారీగా చర్చ సందర్భంగా సభ్యుడు ఎన్.కే. ప్రేమచంద్రన్ ప్రతిపాదించిన సవరణను సభ తిరస్కరించింది. అనంతరం ఎంపీల నినాదాల మధ్యే బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. సభాపతి పలుమార్లు సభ్యులను చర్చలో పాల్గొనాలని కోరినప్పటికీ విపక్ష నేతలు నినాదాలు ఆపలేదు. దీంతో చివరకు సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు.
ఎంఎస్ఎంఈ బిల్లుకు ఆమోదం..
రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి జంతర్మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాష్టీకంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కొందరు లెఫ్ట్ పారీ్టల ఎంపీలు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ స్పందిస్తూ..ఇలాంటి ప్రవర్తన సరికాదని, ఇది కొనసాగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడటానికి ప్రయతి్నంచగా, ప్రతిపక్ష సభ్యులు ముందుగా నినాదాలు చేయడం ఆపి తమ తమ సీట్లకు తిరిగి వెళ్లాలని చైర్మన్ కోరారు.
అయినా నినాదాలు కొనసాగకపోవడంతో సభాపతి సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి సంబంధించిన చట్టంలో మార్పులు చేయడానికి ఉద్దేశించిన ఎంఎస్ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు–2026ను కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితన్రామ్ మాంఝీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్యే గంటన్నర చర్చ అనంతరం బిల్లును సభ ఆమోదించింది.
చందా చోరీపై కొనసాగిన నిరసనలు
రామాలయంలో కోట్ల రూపాయల విరాళాల చోరీపై పార్లమెంట్ వెలుపల సమాజ్వాదీ సహా తర విపక్షాల నిరసనలు కొనసాగాయి. విరాళాల పెట్టెలో డబ్బులు వేస్తూ ఎస్పీ ఎంపీలు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎంపీ డింపుల్యాదవ్ మాట్లాడారు. ‘‘విరాళాలను దుర్వినియోగం చేసిన తీరు, రామజన్మభూమికి సంబంధించి భూ కుంభకోణాలు జరిగిన తీరుకు ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి. ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రీరాముని పాదాల చెంత సమర్పించిన విరాళాల డబ్బు, కానుకలు, విలువైన వస్తువులు ఏమయ్యాయి?, అవన్నీ చివరికి ఎక్కడికి పోయాయి?. వేల కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో మీరు ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు?’’అని ఆమె ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు
సీజేఐతో కలుపుకుని 34 నుంచి 38కి పెంచుతూ బిల్లు పాస్
సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో కలుపుకుని న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు ఉద్దేశించిన ’సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు–2026’కు లోక్సభ ఆమోదం తెలిపింది. సోమవారం భోజన విరామం అనంతరం సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
సుప్రీంకోర్టులో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడంతో పాటు, కోర్టు కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతోనే న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆయన సభకు వివరించారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఈ ఏడాది మే 5న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ వెంటనే మే నెలలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్ స్థానంలోనే కేంద్రం ఇప్పుడు సవరణ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతం సీజేఐతో కలుపుకుని కేవలం 32 మంది న్యాయమూర్తులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.


