బిల్లుకు సభ ఆమోదం  | Lok Sabha Passes Public Examinations Amendment Bill, 2026 | Sakshi
Sakshi News home page

బిల్లుకు సభ ఆమోదం 

Jul 30 2026 4:59 AM | Updated on Jul 30 2026 4:59 AM

Lok Sabha Passes Public Examinations Amendment Bill, 2026

‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు’కు సై

మూజువాణి ఓటుతో ఆమోదించిన లోక్‌సభ

అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధం

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడి  

బిల్లులో సవరణలు చేయాలన్న విపక్షాల వినతిని తిరస్కరించిన ప్రభుత్వం  

న్యూఢిల్లీ: పేపర్‌ లీక్‌లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు–2026’ను లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ సోమవారం బిల్లును సభలో ప్రవేశపెట్టగా, రెండు రోజుల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందింది. నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో ప్రభుత్వం వేగంగా స్పందించిందని జితేంద్ర సింగ్‌ చెప్పారు.

 2024లో పేపర్‌ లీక్‌ నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 52 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. గత కొన్నేళ్లుగా ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన ఆత్మహత్యల రేటు తగ్గిందని పేర్కొన్నారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకే ఈ సవరణ బిల్లే నిదర్శనమని స్పష్టంచేశారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీకి పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రభుత్వ పనితీరుపై అవగాహన లేదని విమర్శించారు.

 బిల్లు ఆమోదం సందర్భంగా ప్రతిపక్షాలు నినాదాలు చేయడంపై జితేంద్ర సింగ్‌ విచారం వ్యక్తంచేశారు. దీనిపై తీవ్రంగా చర్చించి, సూచనలు ఇవ్వడానికి బదులుగా రాజకీయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తప్పుపపట్టారు. ప్రతిపక్ష నాయకుడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. బిల్లులో పలు సవరణలు చేయా లని ప్రతిపక్షాలు సూచించినప్పటికీ ప్రభుత్వం 
అంగీకరించలేదు.  

ఏమిటీ సవరణ బిల్లు?  
→ 2024లో తీసుకొచ్చిన పేపర్‌ లీక్‌ నిరోధక చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది.  

→ పేపర్‌ లీకేజీలకు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే దోషులకు ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా ఇందులో నిబంధనలు చేర్చారు.  

→ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానాను 
ప్రతిపాదించారు.  

→ ప్రతిపాదిత చట్టం కింద నేరాలను విచారించడానికి ఏదైనా సెషన్స్‌ కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుగా నియమించే అధికారాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రాంతాలకు కల్పించాలని ఈ సవరణ బిల్లు సూచిస్తోంది.  

→ అలాగే కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తేదీ నుంచి మూడు నెలలలోపు విచారణను పూర్తి చేయాలని నిర్దేశిస్తోంది.

→ అవసరమైతే నేరంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసే అధికారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తోంది.  

→ చట్టం కింద నేరాలకు సంబంధించిన దర్యాప్తును రెండు నెలల వ్యవధిలోగా పూర్తి చేయాలని నిబంధన విధించారు.  

→ కేసుల విచారణ కోసం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రభుత్వ న్యాయవాదులను నియమించే అధికారాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించారు.  

→ ఏదైనా తీర్పు, శిక్ష లేదా ఉత్తర్వుపై హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. అప్పీల్‌ను స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో దానిని పరిష్కరించాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement