కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలంకు వరుసగా మూడోరోజూ సమైక్య సెగ తగిలింది. వ్యక్తిగత పనిపై మంగళవారం కారులో విశాఖజిల్లా యలమంచిలి వెళ్తుండగా వైఎస్సార్ సీపీ నాయకులు, సమైక్యవాదులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు.
విజయవాడ/పాలకొల్లు/మలికిపురం, న్యూస్లైన్ : కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలంకు వరుసగా మూడోరోజూ సమైక్య సెగ తగిలింది. వ్యక్తిగత పనిపై మంగళవారం కారులో విశాఖజిల్లా యలమంచిలి వెళ్తుండగా వైఎస్సార్ సీపీ నాయకులు, సమైక్యవాదులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన కారు దిగివచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని వివరణ ఇచ్చారు. అంతకుముందు సమావేశం పెడితే అడ్డుకుంటామని విజయవాడలో సమైక్య, పొలిటికల్ జేఏసీలు హెచ్చరించడంతో జేడీ శీలం బసచేసిన హోటల్ యాజమాన్యం మీడియా సమావేశానికి అనుమతివ్వలేదు. దీంతో హోటల్ పోర్టికోలోనే ఆయన విలేకరులతో మాట్లాడాల్సి వచ్చింది.
హైదరాబాద్ యూటీ అవుతుందని ఆశిస్తున్నా
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తనను అడిగారని, యూటీ అవుతుందనే ఆశిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం చెప్పారు. ఆయన మంగళవారం విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా దిండి పర్యాటక కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.