ప్రత్యేక అధికారుల పాలనలో నిర్వీర్యమైన గ్రామపంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడడంతో ప్రభుత్వం దశలవారీగా నిధులు విడుదల చేస్తుండడం ఊరటనిస్తోంది.
సాక్షి, కరీంనగర్:
ప్రత్యేక అధికారుల పాలనలో నిర్వీర్యమైన గ్రామపంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడడంతో ప్రభుత్వం దశలవారీగా నిధులు విడుదల చేస్తుండడం ఊరటనిస్తోంది. ఈ నిధులతో గ్రామాల్లో రెండేళ్లుగా తిష్టవేసిన సమస్యలకు కొంతవరకైనా పరిష్కారం లభించనుంది. జిల్లాలోని 1207 గ్రామపంచాయతీలకు ఇటీవల రూ.20 కోట్ల వరకు మంజూరయ్యాయి. జిల్లాలకు 13వ ఆర్థిక ప్రణాళిక కింద రూ.15.02 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రూ.4.94 కోట్లు విడులయ్యాయి. 13వ ఆర్థిక ప్రణాళిక కింద మొదటి విడత నిధులు గతంలోనే విడుదల కాగా, రెండవ విడత నిధులు విడుదలయ్యే సమయానికి అప్పటి పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో గండి పడింది.
గ్రామపంచాయతీలకు ఎన్నికలు పూర్తి కావడంతో ఈ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా రావడంతో పల్లెలు కొత్త కళను సంతరింకునే వీలు కలుగుతుంది. గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, వీధిదీపాలు, పంచాయతీ భవనాలు, పాఠశాలల నిర్వహణ తదితర అవసరాలకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం మాత్రమే నిర్వహణ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగతా 50 శాతం నిధులను ఆస్తుల కల్పన కోసం ఖర్చు చేయాలి. ఈ నిధులతోపాటు పంచాయతీలకు గ్రాంట్ల రూపంలో అందనున్నాయి. సీనరేజీ, తలసరి ఆదాయం, వృత్తిపన్ను గ్రాంటు ఆయా పంచాయతీల ఖాతాల్లో జమకానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీలకు నిధులు కేటాయిస్తారు. అన్నీ కలిసి చిన్న పంచాయతీలకు రూ.50 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.3-5 లక్షల వరకు సమకూరుతాయి. ఈ నిధులతో పంచాయతీల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంది.