రియల్ ఎస్టేట్ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష ఎకరాలు సేకరిస్తున్నారని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ రెడ్డి విమర్శించారు.
రిటైర్డ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి
తాడేపల్లి రూరల్ : రియల్ ఎస్టేట్ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష ఎకరాలు సేకరిస్తున్నారని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరె డ్డి విమర్శించారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో శుక్రవారం రాత్రి జరిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు అన్యాయం చేస్తే ఏ చట్టం ఒప్పుకోదన్నారు. ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునే అవకాశం లేదని స్పష్టం చేశారు.
రైతు ఇష్టపడి భూములు ఇస్తే తప్ప బలవంతంగా తీసుకునేందుకు ఏ చట్టం ఒప్పుకోదన్నారు. భూ సమీకరణతో వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, భూమిని నమ్ముకున్న అన్నదాతలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రతను కల్పించే ఇటువంటి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అమెరికా వంటి దేశంలోనే కొద్ది పాటి స్థలంలో రాజధాని నిర్మించుకుంటే, మన రాష్ట్రంలో లక్ష ఎకరాలు ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు.
రాజధాని సంస్థ బిల్లు ద్వారా ఇష్టానుసారంగా భూములు సేకరించే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్కు, రుణమాఫీకి సంబంధంలేదని, ఖజానాలో సొమ్ము లేకుండా ఏ మాఫీ చేయలేమని, చెప్పారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించి, వారి పక్షాన న్యాయ పోరాటం చేసేందుకు తాము సిద్ధమని లక్ష్మణరెడ్డి వెల్లడించారు.