
అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరితీయాలి: చంద్రబాబు
మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరి తీయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
సాక్షి, హైదరాబాద్: మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరి తీయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అలాంటి వారిని నలుగురిని ఉరితీస్తే అత్యాచారాలు ఆగిపోతాయన్నారు. శనివారం ఎన్టీ ఆర్ భవన్లో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్, నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గాల డ్వాక్రా మిహ ళలతో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో.. డ్వాక్రా మహిళల్ని ప్రతిరోజూ ఎన్టీఆర్ భవన్కు తరలించి వారితో బాబును అభినందించే కార్యక్రమం నిర్వహిస్తూ ప్రచారం చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది.
ఈ కార్యక్రమాలు గత రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. సోమవారం కూడా ఇలాంటి ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా, శనివారం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలోని ఓ ఆశ్రమంలో బాలికలపై కొన్ని రోజులుగా అత్యాచారం జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. నిర్భయ చట్టం సరిగా అమలు కావటం లేదన్నారు.