రైతుల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కొనే దమ్ము లేక సాగునీటి సంఘాలకు దొడ్డిదారిన ఎన్నికలు నిర్వహించారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: రైతుల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కొనే దమ్ము లేక సాగునీటి సంఘాలకు దొడ్డిదారిన ఎన్నికలు నిర్వహించారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఆరోపించారు. సాగునీటి సంఘాల కమిటీ ఎంపిక విధానాన్ని రద్దు చేసి, 1997 చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పీసీసీ నేతలు గురువారం రోజున గవర్నర్ నరసింహన్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. 6,138 నీటి వినియోగదారుల సంఘాలు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ 90 శాతం స్థానాల్లో ఓటమి చెందడం ఖాయం అన్నారు.
2019 నాటికి రాష్ట్రంలో ఒక పార్టీ మాత్రమే ఉంటుందంటూ ఇటీవల కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. అది వారి అహంకారానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ చెంగలరాయుడు, నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి, కొండ్రు మురళీమోహన్, గంగాభవాని, సుంకర పద్మశ్రీ, జంగా గౌతం, రవి చంద్రారెడ్డి, సుందరరామశర్మ, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.