రబీ సీజన్కు సంబంధించి శనగ విత్తనాలను త్వరగా సేకరించి సిద్ధం చేయాలని జేడీఏ ఠాగూర్ నాయక్ సప్లయింగ్ ఏజెన్సీలను కోరారు.
విత్తనాలను సిద్ధం చేయండి
Sep 27 2013 12:38 AM | Updated on Apr 3 2019 9:27 PM
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్ :రబీ సీజన్కు సంబంధించి శనగ విత్తనాలను త్వరగా సేకరించి సిద్ధం చేయాలని జేడీఏ ఠాగూర్ నాయక్ సప్లయింగ్ ఏజెన్సీలను కోరారు. ఈ మేరకు గురువారం మార్క్ఫెడ్, హాక, ఏపీ సీడ్స్, ఆయిల్ ఫెడ్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాకు 61 వేల క్వింటాళ్లు శనగ విత్తనాలు మంజూరయ్యాయని, వీటిని ఆయా సంస్థలు సరఫరా చేయాలని తెలిపారు. సకాలంలో విత్తనాలను పొజిషన్ చేయాలని సూచించారు.
సబ్సిడీ సొమ్ము రైతు ఖాతాలకు..
రబి సీజన్కు సంబంధించి సబ్సిడీ విత్తనాల పంపిణీ సమయంలో రైతులు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని జేడీఏ తెలిపారు. తర్వాత సబ్సిడీ మొత్తం సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సమావేశంలో మార్క్ఫెడ్ , ఏపీసీడ్స్ మేనేజర్లు సాలురెడ్డి, ఏపీ సీడ్ మేనేజర్ సత్యనారాయణరెడ్డి, ఆయిల్ ఫెడ్ ప్రతినిధి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
విత్తన పంపిణీకి సహకరించేలా చూడండి
రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రబీ సీజన్ విత్తనాల పంపిణీకి వ్యవసాయాధికారులు సహకరించేలా చూడాలని కలెక్టర్ సుదర్శన్రెడ్డి జేడీఏకు సూచించారు. వ్యవసాయ శాఖలో అటెండర్, ఏఈఓ నుంచి డీడీఏ స్థాయి అధికారుల వరకు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరశిస్తూ నిరవధిక సమ్మెలో ఉండటంతో విత్తనాల పంపిణీ ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో వారంపాటు విత్తనాల పంపిణీకి సహకరించేలా వ్యవసాయాధికారులను ఒప్పించాలని కలెక్టర్ కోరగా జేడీఏ జేఏసీ నేతలు కర్నూలు, నందికొట్కూరు ఏడీఏలతో మాట్లాడారు. సీమాంధ్ర జిల్లాల వ్యవసాయ శాఖ జేఏసీ నేతలు, ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి ఈనెల 30న నిర్ణయాన్ని చెబుతామని వారు తెలిపారు. ఇది వరకే సమ్మెలో ఉన్నందున విత్తనాల పంపిణీ చేపట్టలేమని కమిషనర్కు స్పష్టం చేశామని, దీనిపై మరోసారి చర్చిస్తామని వారు పేర్కొన్నారు.
Advertisement
Advertisement