పంచాయతీలకు ‘విద్యుత్‌’ షాక్‌..! | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు ‘విద్యుత్‌’ షాక్‌..!

Published Thu, Jul 26 2018 12:44 PM

Power Department Shock To Panchayat Office - Sakshi

ఓపైపు నిధుల లేమి, మరోవైపు ఖర్చుల భారంతో విలవిలలాడుతున్న పంచాయతీలపై విద్యుత్‌ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్ల కరెంట్‌ బిల్లులను చెల్లించాలంటూ ట్రాన్స్‌–కో అధికారులు పంచాయతీలకు నోటీసులు పంపిస్తున్నారు. 2006 నుంచి విద్యుత్‌ బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా భారీగా బకాయిలు పేరుకుపోయాయి.

మదనపల్లె రూరల్‌: జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 66 మండలాలు, 1363 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ: 7.50 కోట్ల వరకు విద్యుత్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీడీఓలపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి విద్యుత్‌ కనెక్షన్లు తొలగించిన దాఖలాలు కూడా లేకపోలేదు. పంచాయతీలు బిల్లులు చెల్లించకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తే విద్యుత్‌ కనెక్షన్‌లను తొలగించాలని ట్రాన్స్‌కో నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో కనీసం అందులోంచి తమ బకాయిలను రాబట్టేందుకు ఆశాఖ అధికారులు నడుం బిగించారు. గ్రామ తాగునీటి అవసరాలు తీర్చే విద్యుత్‌ మోటార్ల బకాయిలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీధిలైట్లు, నీటి పథకాల విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికే పలుమార్లు పంచాయతీ శాఖ అధికారులకు, సర్పంచ్‌లకు నోటీసులు జారీ చేశారు.

బకాయి వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌
డివిజన్‌లో విద్యుత్‌ బకా యిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మండలాల ఎంపీడీఓలు, సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. బకాయిలు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మండల శాఖా« దికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో వ్వవహరించి పెండింగ్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది.–భాస్కర్‌నాయుడు, ట్రాన్స్‌కో డీఈ, మదనపల్లె

Advertisement
Advertisement