విద్యుత్ కోతలతో వెతలు | power cuts in ap | Sakshi
Sakshi News home page

విద్యుత్ కోతలతో వెతలు

Sep 7 2015 12:46 AM | Updated on Sep 3 2017 8:52 AM

ఒకవైపు వేసవిని తలపిస్తున్న ఉక్కపోత.. మరోవైపు పట్టణాల్లో దోమల మోత, విద్యుత్ కోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడురోజుల నుంచి రాత్రిపగలు తేడాలేకుండా

 కొవ్వూరు:ఒకవైపు వేసవిని తలపిస్తున్న ఉక్కపోత.. మరోవైపు పట్టణాల్లో దోమల మోత, విద్యుత్ కోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడురోజుల నుంచి రాత్రిపగలు తేడాలేకుండా విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు.  ఎప్పుడు కరెంటు తీస్తారన్న సమాచారం లేకపోవడంతో అన్ని వర్గాల జనం ఇబ్బందులను చవిచూస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట వ్యాపారాలు సాగే సమయంలో కోతలు విధించడంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళుతున్నారు. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా రోజుకు ఐదారు గంటల పాటు సరఫరాలో కోత విధిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక అవాంతరాల నేపథ్యంలో సరఫరాకు ఆటంకం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. వర్షకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే రానున్న వేసవిలో విద్యుత్ సరఫరా ఎలా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
  వ్యవసాయానికి ఇచ్చే ఏడు గంటల విద్యుత్ సరఫరాలోను భారీగా కోత విధిస్తున్నారు. మూడు, నాలుగు గంటలే  సరఫరా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకి 12 నుంచి 13 మినియన్ యూనిట్‌ల విద్యుత్ అవసరం కాగా కేవలం 9 నుంచి 9.5 మినియన్ యూనిట్ ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుంది. ఇరవై నాలుగు గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రధానంగా రాష్ర్ట వ్యాప్తంగా ఏపీఈపీడీఎస్, ఎపీఈపీడీఎల్ పరిధిలో 2,300 మెగా వాట్ల ఉత్పత్తి తగ్గినట్టు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీఎల్ )పరిధిలో 2,100 మెగా విద్యుత్ డిమాండ్ ఉంటే ప్రస్తుతం 1,700 మెగా వాట్స్ మాత్రమే సరఫరా అవుతుంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
 
 డిమాండ్ కంటే నాలుగు వంద మెగా వాట్స్ ఉత్పత్తి తగ్గడంతో ఎమర్జన్సీ లోడు రిలీఫ్ పేరుతో రెండేసి గంటల చొప్పున ప్రాంతాల వారీగా కోతలు విధిస్తున్నారు. ఇలా రోజుకి రెండు, మూడు విడతల్లో ఐదు నుంచి ఆరు గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సింహాద్రి పవర్ ప్లాంట్‌లో 510 మెగా వాట్లు, వీటీపీఎస్‌లో 210 మెగావాట్లు, రామగుండం ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 600 మెగావాట్స్  ఉత్పత్తి త గ్గింది. దీనికితోడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా 686 మెగా వాట్స్ అందకపోవడంతో ఇబ్బందికరంగా ఉందని అధికారులు
 చెబుతున్నారు.
 
 అప్రకటిత కోతలతో అవస్థలు
 అప్రకటిత విద్యుత్ కోతలు విధించడం మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి అన్నీ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం. వ్యవసాయానికి  ఇచ్చే విద్యుత్‌కు కోత విధించడంతో నీటితడులు ముందుకు సాగడంలేదు. కనీసం కోతలు విధించే సమయం ప్రకటిస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. నాయకులు ఈ విషయంలో దృష్టి సారించి కోతలను ఆపు చేయించాలి.
 -మారిన రామకృష్ణ, రైతు, నందమూరు, కొవ్వూరు మండలం
 
 సాంకేతిక లోపాలే కారణం
 ప్రస్తుతం డిమాండ్ అనుగుణంగా విద్యుత్ సరఫరా లేదు. ఉన్న విద్యుత్‌ను ఇబ్బందుల్లేకుండా సరఫరా చేస్తున్నాం. విద్యుత్ ఉత్పత్తి సంస్థలో సాంకేతిక లోపాలు కారణంగా సరఫరా త గ్గింది. ఎప్పటిలోగా విద్యుత్ కోతలు తగ్గుతాయనేది చెప్పలేం.
 -సీహెచ్.సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఈ, ఏపీఈపీడీఎస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement