
రాజకీయ బదిలి
రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్లో పనిచేసే ఆర్డీఓలకు రాజకీయ బదిలీ తప్పడం లేదు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే వారిని సాగనంపడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు.
రాజంపేట:
రాజంపేట రెవెన్యూ డివిజన్లో పనిచేసే ఆర్డీఓలకు రాజకీయ బదిలీ తప్పడం లేదు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే వారిని సాగనంపడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. తక్కువ వ్యవధిలోనే ముగ్గురు ఆర్డీఓలకు రాజకీయ బదిలీ తప్పలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిన్న కాంగ్రెస్.. నేడు తెలుగుదేశం పాలకుల హయాంలో ముగ్గురు మహిళా ఆర్డీఓలపై బదిలీ వేటు పడింది.
పద్మజ నుంచి..
వెంకటరమణారెడ్డి ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన తర్వాత ఆర్డీవోగా పద్మజ బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటంతో ఆ సమయంలో సీఎంకు ముఖ్యుడిగా వ్యవహరిస్తున్న ఈ నియోజకవర్గానికి చెందిన నేత ఆమెను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయించారు. ఆ తర్వాత శ్రీనివాసులు వచ్చారు. అనంతరం ఐఏఎస్ క్యాడర్కు చెందిన అధికారిణి ప్రీతిమీనా సబ్కలెక్టర్గా నియమితులయ్యారు. ఈమె ముక్కుసూటిగా విధులు నిర్వర్తించడంతో అధికారపార్టీ నేతలు బదిలీ చేయించారు. అయితే ఆమె బదిలీపై వెళ్లడానికి స్వతహాగానే సిద్ధమైన నేపథ్యంలో ఆమెకు ఈ బదిలీ కలిసి వచ్చింది.
ఆరునెలలకే..
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈ యేడాది ఫిబ్రవరి 13వతేదీన విజయసునీత ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలు, మండలపరిషత్, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో ఆమె సఫలీకృతులయ్యారు. ఈమె పట్టుమని పది నెలలు కూడా పనిచేయకముందే ఆరు నెలలకే బదిలీ చేశారు. ఈ బదిలీపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ముగ్గురి బదిలీలోనూ గతంలో కాంగ్రెస్లో..ప్రస్తుతం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నేతప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.